విభజన హామీలు అమలు చేయాలి..
తెలంగాణకు న్యాయం చేయండి
- బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
- ఖమ్మం, పాలమూరును పట్టించుకోండి
- భద్రాచలం నుంచి ఆంధ్రా లో కలిసిన నాలుగు గ్రామపంచాయతీలను తిరిగి ఇచ్చేయండి
- కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేసి, కేటీపీఎస్ విస్తరణ పై దృష్టి సారించాలని గళమెత్తిన రామసహాయం
న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 అమలుపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్సభలో బుధవారం గళమెత్తారు. విభజన సమయంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సంస్థాగత, ఆర్థిక, మౌలిక రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు.
హామీలు కాగితాలకే పరిమితం కావద్దు
విభజన చట్టంలో తెలంగాణ అభివృద్ధి కోసం అనేక హామీలు, కట్టుబాట్లు ఉన్నప్పటికీ, వాటి అమలు ఇంకా పూర్తికాలేదని రఘురాం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హామీలు కాగితాలకే పరిమితం కాకుండా
అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ స్థాయి విద్యాసంస్థలు అవసరం
తెలంగాణలో ఎన్ఐటి (NIT), ఐఐఎం (IIM), ఐఐఎస్ఇఆర్ (IISER), సెంట్రల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే ఉన్న విద్యాసంస్థలను జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలని సూచించారు.
పారిశ్రామికాభివృద్ధి, ఐటీ విస్తరణ
ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇవ్వాలని, హైదరాబాద్ ఇప్పటికే ఐటీ హబ్గా ఉన్నందున దాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఖమ్మం జిల్లా ప్రస్తావన
మహబూబ్నగర్, ఖమ్మం వంటి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సెక్షన్ 94(2) కింద రావాల్సిన ఆర్థిక తోడ్పాటు ఇంకా పూర్తిగా అందలేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఎప్పుడు..?
సెక్షన్ 93 ప్రకారం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు హామీ ఇంకా నెరవేరలేదని పేర్కొంటూ దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
నీటి వనరులపై న్యాయం
గోదావరి, కృష్ణా నదులు తెలంగాణలోనే అత్యధికంగా ప్రవహిస్తున్నందున, రెండు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని కోరారు.
కేటీపీఎస్ కు సంబంధించి..
కేటీపీఎస్ (KTPS) థర్మల్ పవర్ స్టేషన్కు అదనంగా 825 మెగావాట్ల సామర్థ్యాన్ని పునరుద్ధరించాలని సూచించారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి
రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) కోసం.. అదనపు నిధులు కేటాయించాలని కోరారు.
కొత్తగూడెంకు ఎయిర్ పోర్ట్ కావాల్సిందే..
వరంగల్కు విమానాశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, కొత్తగూడెం మరియు ఆదిలాబాద్/పెద్దపల్లి ప్రాంతాల్లో కూడా విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
- మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు.
భద్రాచలం గ్రామాల సమస్యపై..
రెండో సవరణలో భద్రాచలం అసెంబ్లీ పరిధిలోని నాలుగు గ్రామ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో విలీనం కావడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని కేంద్రాన్ని కోరారు.
ఏపీ సోదర, సోదరీమణులారా..
అది బ్లాక్ డే కాదు..
రెండు రాష్ట్రాల అభివృద్ధికి చక్కటి అవకాశం
ఆంధ్రప్రదేశ్ సోదర సోదరీమణులరా.. అని పేర్కొని ప్రత్యేకంగా విన్నపం చేస్తూ… రాష్ట్ర విభజనను ఒక చీకటి రోజుగా చూడవద్దని సూచించారు. ఇది రెండు రాష్ట్రాల అభివృద్ధికి గొప్ప అవకాశమని పేర్కొన్నారు.
సమాన న్యాయం చేయాలి..
ఆంధ్రప్రదేశ్కు అదనపు నిధులు ఇవ్వడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే అదే విధంగా తెలంగాణ అభివృద్ధికి కూడా ఈ బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. రెండు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందేలా చూడాలని సూచిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.