బాత్రూంలో జారిపడి… శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు కన్నుమూత!
- తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన శ్రీచైతన్య విద్యాసంస్థలు
- జారిపడడంతో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావు
- హైదరాబాదులో తుదిశ్వాస విడిచిన వైనం
- భౌతికకాయం విజయవాడకు తరలింపు
తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావు కోలుకోలేకపోయారు.
ఆయన భౌతికకాయాన్ని ఈ సాయంత్రం విజయవాడకు తరలించనున్నారు. బీఎస్ రావు అంత్యక్రియలు విజయవాడలో నిర్వహించనున్నారు.
డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, అనతికాలంలోనే ఆ సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు.
మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్ కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను ఉన్నతస్థానానికి చేర్చారు.
డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు.
శ్రీచైతన్య అధినేత డాక్టర్ బీఎస్ రావు మృతిపై చంద్రబాబు స్పందన
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు బాత్రూంలో ప్రమాదవశాత్తు జారిపడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. విద్యా దార్శనికుడు, శ్రీచైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యానని తెలిపారు.
డాక్టర్ బీఎస్ రావు ఆంధ్రప్రదేశ్ పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి తనను తాను విద్యారంగానికి అంకితం చేసుకున్నారని కొనియాడారు. ఆయన అందించిన ఘనతర వారసత్వం ఇకపైనా కొనసాగుతుందని, ఆయన సదా చిరస్మరణీయుడని కీర్తించారు.
ఈ కష్టకాలంలో డాక్టర్ బీఎస్ రావు కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.