- వారం రోజుల వ్యక్తిగత టూర్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న వివేక్
- సాయంత్రం రాజగోపాల్ రెడ్డితో మాజీ ఎంపీ వివేక్ భేటీ
- కాంగ్రెస్లోకి వెళ్లడంపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం
తమ పార్టీ నుంచి ఇదివరకు బీజేపీలో చేరిన పలువురు కీలక నేతలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడో రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. మాజీ ఎంపీ వివేక్ కూడా అదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి, వివేక్తో పాటు మరో కీలక మహిళా నేతను కూడా కాంగ్రెస్లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట.
ఈ రోజు సాయంత్రం రాజగోపాల్ రెడ్డి, వివేక్ సమావేశమై కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై చర్చించనున్నారు. వారం రోజుల వ్యక్తిగత పర్యటన ముగించుకున్న వివేక్ ఈ రోజు హైదరాబాద్లో అడుగు పెట్టారు. సాయంత్రం రాజగోపాల్ రెడ్డితో భేటీ కానున్నారు. వీరిద్దరు సమావేశమై బీజేపీలోనే ఉండాలా? కాంగ్రెస్లో చేరాలా? అనే అంశంపై చర్చించనున్నారు. వీరిద్దరి భేటీ తర్వాత నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్టీలో చేరితే వీరిద్దరికి సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. బీజేపీ విడుదల చేసిన 52 మందితో కూడిన మొదటి జాబితాలో రాజగోపాల్ రెడ్డి, వివేక్ పేర్లు లేవు. దీంతో వీరు పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బూర నర్సయ్య గౌడ్ పోటీ?
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన తిరిగి అదే గూటికి చేరుతారనే చర్చ మీడియాలో నడుస్తోంది. బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో మునుగోడు నుంచి అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి పేరే ఉంటుందని అందరూ భావించారు. కానీ మునుగోడు అభ్యర్థిని బీజేపీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నందునే బీజేపీ ప్రకటించలేదని భావిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే మునుగోడు నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్ను రాజగోపాల్ రెడ్డిపై పోటీ చేయించాలని యోచిస్తోందట. టిక్కెట్ల కేటాయింపుకు సంబంధించి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే, ఇక్కడ బీసీలు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా గౌడ ఓటర్లు 35వేలకు పైగా అంటే దాదాపు 16 శాతం వరకు ఉన్నారు. ముదిరాజ్, పద్మశాలి, యాదవ, ఎరుకల, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ ఓటర్లు కూడా భారీగానే ఉన్నారు. దీంతో మునుగోడు నుంచి బూర నర్సయ్యకు అవకాశం ఇస్తే కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.
2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించారు. అయితే ఆయన మాత్రం మునుగోడు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరట. పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడంపై ఆయన ఆసక్తితో ఉన్నారని, ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేసినా ఇబ్రహీంపట్నం ఆయన తొలి ప్రాధాన్యతగా వుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే కనుక బూర నర్సయ్య బరిలోకి దిగవచ్చునని చెబుతున్నారు.