నెలలో 27 రోజులు ఫామ్ హౌస్ లో గడిపే ముఖ్యమంత్రి కావాలా..?
ఇందిరమ్మ రాజ్యం కావాలా…ఫామ్ హౌస్ లో గడిపే ముఖ్యమంత్రి కావాలా పొంగులేటి
- స్థానిక ఎమ్మెల్యే కాసుల కోసం కండువా మార్చాడు
- అభివృద్ధి కోసం మార్చానని చెబుతున్నాడు
- నేలకొండపల్లి మండల ఎన్నికల ప్రచారంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2023/11/ponguleti-deepavali-.jpeg?resize=1024%2C683&ssl=1)
నెలలో మూడు రోజులు బయటకు వచ్చి… మిగిలిన 27 రోజుల పాటు ఫామ్ హౌస్ లో గడిపే ముఖ్యమంత్రి కావాలా…? ఇందిరమ్మ రాజ్యం కావాలా…! మీరే తేల్చుకోండి అంటూ ప్రజలను ఉద్దేశించి పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలంలోని రాయిగూడెం,అప్పలనర్సింహాపురం, కట్టుకాచారం, కొంగర తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరిస్తూ ముందుకు సాగారు. ప్రతి గ్రామంలోనూ పొంగులేటికి పూలతో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నెలలో మూడు రోజుల పాటు బయట ఉండేది కూడా దేశంలో ఉన్న సంపదను ఎలా కొల్లగొట్టాలనే ఆలోచన తప్ప, సామాన్య ప్రజల కోసంకాదాని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టసుఖాల కోసం కేసీఆర్ ఏనాడు ఆలోచించడని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇక్కడి ప్రజల సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి ఒక్క మాట కూడా చెప్పకుండా మూడు నెలల్లోనే పార్టీ కండువా కప్పుకున్నాడన్నారు. కాసుల కోసం కండువా మార్చాడనేది జగమెరిగిన సత్యం అని పేర్కొన్నారు. కానీ సదరు ఎమ్మెల్యే అభివృద్ధి కోసం మార్చానని చెబుతున్నాడని… ఈ ఐదేళ్లల్లో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని సవాల్ విసిరారు. ఈనెల 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక మ్యానిఫెస్టెతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికీ న్యాయం చేకూరింపజేస్తామని తెలిపారు. పర్యటన సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరినవారందరికీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు…