Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన… మంత్రి శ్రీ పొంగులేటి

హైదరాబాద్, 29 సెప్టెంబర్, 2024: తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి, బలోపేతం చేసే దిశగా పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సామాన్యులకు, రైతులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నామని, ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరుకుందన్నారు.

షామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో ఆదివారం నాడు 33 జిల్లాల తహశీల్దార్లతో మంత్రిగారు ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు కాపాడే విషయంలో పేదలకు సహాయం అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మరింత మెరుగుపడాలని మరింత వేగం పెరగాలని అన్నారు. ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణలకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సిబ్బంది పూర్తిగా సహకరించాలి, వారి సమస్యలను పరిష్కరించాలి. రెవెన్యూ ఉద్యోగులు మరింత పట్టుదలతో సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్దిదారులను గుర్తించడంలోను, వారికి సంక్షేమ పథకాలను అందించడంలోను రెవెన్యూ యంత్రాంగం పాత్ర కీలకమైనది. అందులో తహశీల్దార్ల పాత్ర అతి ముఖ్యమైనది. ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుంది. ఈ విభాగం సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేరి ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు లభిస్తాయని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా, లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు, పేదలు, సామాన్యులకు వీలైనంత మేరకు చేయగలిగినంత సహాయం చేయాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పేదసామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుంది. వీధి విధానాలు రూపొందిస్తుంది. దానికి అనుగుణంగానే క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు పని చేయాలి.

కలెక్టర్ నుండి అనుమతి తీసుకున్న తర్వాతే తహశీల్దార్ల మీద కేసులు నమోదు చేసేలా రాష్ట్ర డీజీ‌పితో చర్చించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అలాగే రెవెన్యూ సిబ్బంది కోసం హైదరాబాద్ లో ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

గత ప్రభుత్వం హడావుడిగా మండలాల సంఖ్యను పెంచింది కానీ, దానికి తగినట్టుగా కార్యాలయాలను ఏర్పాటు చేయలేదని, చేసిన వాటిలో మౌళిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదని అవసరమేరకు సిబ్బందిని కూడా నియమించలేదని వీటిని దృష్టిలో పెట్టుకుని తహశీల్దార్ల కార్యాలయాలలో మౌళిక వసతులను కల్పించడంతో పాటు రెగ్యులర్ స్టాఫ్, పదోన్నతులు, కోర్టు ఖర్చులు, అద్దె భవనాలు, అద్దె వాహన బకాయిలతో పాటు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహశీల్దార్ల బదిలీలపై ఉద్యోగ సంఘాలతో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి అత్యంత కీలకమైనదని ఈ శాఖ బాగా పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. దాదాపు ఐదు సంవత్సరాలనుంచి పెండింగ్ లో ఉన్న 300 మంది ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్మెంట్ ఫైళ్లను మంత్రిగారు క్లియర్ చేశారని వెల్లడించారు.

సుధీర్ఘంగా జరిగిన ఈ సమేవేశంలో దాదాపు రెండు గంటలపాటు వివిధ జిల్లాలనుంచి వచ్చిన తహశీల్దార్లు గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలను వాటి వల్ల ప్రజలు ఎదురుకొన్న ఇబ్బందులను భవిష్యత్తులో ఏ విధంగా చేస్తే బాగుంటుందని పలు అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు.

ఈ సమావేశంలో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ పొత్రు ఐ‌ఏ‌ఎస్, ట్రెసా అధ్యక్షులు శ్రీ వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వి. లచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రాములు, ప్రధాన కార్యదర్శి శ్రీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమల వెంకన్న ఆస్తులెంతో తెలుసా?… 

Drukpadam

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా య‌డియూర‌‌ప్ప‌?

Drukpadam

హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Drukpadam

Leave a Comment