
వైద్యం చేయ కుండా చేసినట్టుగా దొంగ బిల్లులు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ కాజేసిన ఆసుపత్రులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. అక్రమాలకు పాల్పడిన ఖమ్మం జిల్లాలోని10 ఆసుపత్రులను మూసి వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కళావతి బాయి తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చికిత్సలు చేయ కుండానే నకిలీ బిల్లులు సృష్టించి ముఖ్యమంత్రి సహాయని నిధి నుండి నిధులను కాజేసిన వ్యవహారంలో ఖమ్మం జిల్లాలోని10 ఆసుపత్రులపై విజిలెన్స్ విభాగం, వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర అధికారుల బృందం చేసిన తనిఖీల ఆధారంగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సంబంధిత ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేసి, మూసి వేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీ వినాయక హాస్పిటల్, శ్రీ కర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, మేఘ శ్రీ హాస్పిట్జల్ట్, డాక్టర్ జే.ఆర్. ప్రసాద్ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మూసి వేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.