పహల్గామ్ ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. పెహల్గామ్లో నరమేధం సృష్టించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, ఆషిఫ్ షేక్ ఇళ్లను సైన్యం ఐఈడీతో పేల్చేసినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. పెహల్గామ్ మారణహోమంలో జమ్ము కశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లాకు చెందిన థోకర్ కీలక నిందితులలో ఒకరు కాగా, ఆషిఫ్ షేక్ ఈ దాడి కుట్రలో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బిజ్ బెహరా, త్రాల్ ప్రాంతాల్లోనూ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. లోకల్ ఉగ్ర వాదుల నివాసాలపై దాడి చేస్తున్నాయి. మరో వైపు ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల సమాచారం తెలియ జేసిన వారికి రూ.20 లక్షలు బహుమతిగా ఇస్తామని జమ్మూకశ్మీర్ అనంత్నాగ్ పోలీసులు గురువారం ప్రకటించారు. ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు ఉగ్ర వాదుల స్కెచ్లతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. కాగా, మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పాశవిక చర్యలో దాయాది పాకిస్థాన్ హస్తం ఉందని ఆరోపిస్తూ భారత్ కఠిన ఆంక్షలకు దిగింది. అటు పాకిస్థాన్ కూడా భారత్పై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.