- సమావేశంలో పాల్గొంటున్న ప్రధాని, సీజేఐ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్
- మే 25న ముగియనున్న ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదుపరి డైరెక్టర్ను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ కీలక సమావేశంలో పాల్గొనేందుకు లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కార్యాలయానికి (పీఎంవో) చేరుకున్నారు. సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసే అధికారం త్రిసభ్య కమిటీకి ఉంటుంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి ఛైర్మన్గా వ్యవహరించగా, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశమై తదుపరి సీబీఐ చీఫ్ అభ్యర్థిని ఖరారు చేయనుంది. సీబీఐ డైరెక్టర్ పదవీకాలం సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో దీనిని ఐదేళ్ల వరకు పొడిగించే వెసులుబాటు చట్టంలో ఉంది. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం ఈ నెల (మే) 25వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్ ఎంపిక అనివార్యమైంది. కర్ణాటక కేడర్కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్, గతంలో ఆ రాష్ట్ర డీజీపీగా పనిచేశారు. సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో ఆయన 2023 మే నెలలో సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన పదవీకాలం పూర్తికావస్తుండటంతో, కొత్త డైరెక్టర్ ఎంపిక కోసం ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో ఎవరి పేరు ఖరారవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.