జాతీయ వార్తలు

పాక్ నా…నరకమా …?అంటే నరకానికే ఇష్టపడతా…జావేద్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు!

  • పాకిస్థాన్, నరకం రెండింటిలో నరకాన్నే ఎంచుకుంటానన్న జావేద్ అక్తర్
  • ఇరువైపులా ఉన్న తీవ్రవాదులు తనను దూషిస్తున్నారని వ్యాఖ్య
  • ఒకరు కాఫిర్ అంటే, మరొకరు జిహాదీ అంటున్నారని వెల్లడి
  • కాశ్మీరీలు పాకిస్థానీలనేది అబద్ధమని స్పష్టం చేసిన అక్తర్
  • 99% కాశ్మీరీలు భారత్‌కు విధేయులని వ్యాఖ్య

ప్రఖ్యాత సినీ గేయ రచయిత, కథా రచయిత జావేద్ అఖ్తర్ పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు నరకం లేదా పాకిస్థాన్ అనే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉంటే, తాను నరకాన్ని ఎంచుకుంటానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జావేద్ అఖ్తర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

శనివారం ముంబైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జావేద్ అఖ్తర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు అనేక ప్రశంసలతో పాటు, “రెండు వైపులా ఉన్న తీవ్రవాదుల” నుంచి దూషణలు, విమర్శలు కూడా వస్తుంటాయని ఆయన తెలిపారు. అయితే, ఆ రెండు వైపులా ఎవరున్నారనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పలేదు.

“ఏదైనా ఒక పక్షం గురించే మాట్లాడితే, ఆ ఒక్క పక్షానికే కోపం వస్తుంది. కానీ అందరి తరఫున మాట్లాడితే, చాలా మందికి కోపం వస్తుంది. నా ట్విట్టర్, వాట్సాప్ చూపిస్తే అర్థమవుతుంది.. రెండు వైపుల నుంచి ఎలాంటి తిట్లు వస్తాయో. చాలా మంది నన్ను అభినందిస్తారు, ప్రశంసిస్తారు, నాలో స్ఫూర్తి నింపుతారు. కానీ, రెండు వైపులా ఉన్న తీవ్రవాదులు నన్ను దూషిస్తారన్నది కూడా నిజం. ఇది ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఒకవైపు నుంచి తిట్టడం ఆపేస్తే, నేనేమైనా తప్పు చేస్తున్నానేమోనని నాకు అనుమానం వస్తుంది” అని ఆయన  చమత్కరించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, “ఒక వర్గం నన్ను ‘కాఫిర్’ అనీ, ‘జహన్నమ్’ (నరకం)కు పోతావనీ అంటుంది. మరో వర్గం నన్ను ‘జిహాదీ’ అనీ, పాకిస్థాన్ వెళ్లిపోవాలనీ అంటుంది. ఇప్పుడు ఈ రెండే నాకు మిగిలిన దారులైతే, నేను నరకానికి వెళ్లడానికే ఇష్టపడతాను… నేను 19 ఏళ్ల వయసులో ముంబై వచ్చాను. ఈ నగరం, మహారాష్ట్ర వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను” అని స్పష్టం చేశారు.

ఈ నెల ఆరంభంలో కూడా జావేద్ అఖ్తర్, కశ్మీరీలు పాకిస్థానీయులని ఆ దేశం చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. “అది పూర్తిగా అబద్ధం. స్వాతంత్ర్యం తర్వాత పాకిస్థాన్ కశ్మీర్‌పై దాడి చేసినప్పుడు, కశ్మీరీలే వారిని మూడు రోజుల పాటు అడ్డుకున్నారు. ఆ తర్వాతే మన సైన్యం అక్కడికి చేరుకుంది. నిజం చెప్పాలంటే, వారు భారత్ లేకుండా బతకలేరు. పహల్గామ్‌లో జరిగిన ఘటన వారిని తీవ్రంగా బాధించింది. పర్యాటకం దెబ్బతింది. కశ్మీరీలు భారతీయులే, వారిలో 99 శాతం మంది భారత్‌కు విధేయులు” అని ఆయన వివరించారు.

Related posts

నిపా సెకండ్ వేవ్ లేదన్న కేరళ మంత్రి.. ఊపిరి తీసుకుంటున్న ప్రజలు

Ram Narayana

 అమ్మమ్మకు పంపిన ఆ ‘గుడ్ మార్నింగ్’ సందేశమే ఆఖరిది.. విమాన ప్రమాదంలో యువ పైలట్ విషాదాంతం!

Ram Narayana

హిండెన్‌బర్గ్ ఆరోపణలు: మాధవి బచ్‌పై కేసు కొట్టివేసిన లోక్‌పాల్…

Ram Narayana