ఆంధ్రప్రదేశ్

గత సీఎం హెలికాప్టర్ లో వెళుతుంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవి : చంద్రబాబు సెటైర్

  • అనంతవరంలో మొక్కలు నాటిన సీఎం చంద్రబాబు
  • గత ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపణ

గత వైసీపీ ప్రభుత్వం చెట్లను నరికివేయడమే పనిగా పెట్టుకుందని, వారికి చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై కనీస అవగాహన లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాటిని నరికివేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇవాళ రాజధాని ప్రాంతంలోని అనంతవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ పరిరక్షణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గత ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుంటే కింద ఉన్న చెట్లు ఎగిరిపోయేవని సెటైర్ వేశారు. కానీ ఇప్పుడు తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నప్పుడు ఒక్క చెట్టు కూడా నరకడం లేదని ప్రజలు గమనించాలని కోరారు. కొన్ని దేశాల్లో చెట్లను నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారని, చెట్టు నరకాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు గుర్తుచేశారు. చెట్టు నరికితే మనిషిని చంపినంత నేరంగా పరిగణించి చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. “చెట్లు పెంచడం మనందరి బాధ్యత. చెట్లు నరకడం అత్యంత దుర్మార్గమైన చర్య” అని ఆయన పేర్కొన్నారు.

రానున్న నాలుగైదు సంవత్సరాల్లో రాష్ట్రంలో కనీసం 37 శాతం పచ్చదనం ఉండేలా చూడాలన్నది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకోసం ఉద్యానవన పంటల (హార్టికల్చర్) అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, ఈ విషయంలో పవన్ కల్యాణ్ కూడా స్పష్టమైన సూచనలు చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం పది మొక్కలు నాటి పెంచాలని పిలుపునిచ్చారు. “అందరం ఆక్సిజన్ తీసుకుంటున్నాం కదా? మరి మొక్కలు నాటే బాధ్యత మనపై లేదా?” అని ప్రజలను ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన రావాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లలో గ్లోబల్ వార్మింగ్ ఒకటని, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి వర్షాలు తగ్గిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో సాగు ప్రమాదంలో పడుతోందని, తాగునీటికి ఇబ్బందులు తలెత్తి ఫ్లోరైడ్ సమస్యలు పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన చెందారు. చిన్నప్పుడు చదువుకున్న కథను గుర్తుచేస్తూ, “ఒక వృద్ధుడు తన తర్వాతి తరాల కోసం చెట్టు నాటినట్లు, మనం కూడా భవిష్యత్ తరాల కోసం చెట్లు నాటాలి. స్వార్థంతో బతకడం కాదు, విజ్ఞతతో ప్రవర్తించాలి,” అని హితవు పలికారు. పద్మశ్రీ వనజీవి రామయ్య వంటి వ్యక్తులు మనకు ఆదర్శమని, వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.

Related posts

విద్యుత్ సైకిళ్ల శ్రేణిలో మరో రెండు మోడళ్లు తీసుకువచ్చిన ‘హీరో’

Drukpadam

iPhone 8 Leak Reiterates Apple’s Biggest Gamble

Drukpadam

పెళ్లి కాకపోతే అబార్షన్ చేయించుకోవచ్చు.. సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు!

Drukpadam