Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

 రష్యా డ్రోన్లను కూల్చేస్తే నెలకి రూ. 2.2 లక్షలు .. ఉక్రెయిన్ సంచలన ఆఫర్

  • రష్యా డ్రోన్ల నిరోధానికి ఉక్రెయిన్ సరికొత్త కార్యక్రమం
  • డ్రోన్లను కూల్చే పౌరులకు నెలజీతం ఇచ్చేందుకు నిర్ణయం
  • శిక్షణ పొందిన వాలంటీర్లు, పారామిలిటరీ సభ్యుల నియామకం
  • రెండేళ్ల పాటు అమల్లో ఉండనున్న ఈ పథకం

రష్యా డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం ఒక వినూత్న పథకాన్ని ప్రకటించింది. శత్రుదేశ డ్రోన్లను గుర్తించి, నేలకూల్చే పౌరులకు నెలకు సుమారు రూ. 2.2 లక్షల వరకు జీతం అందించనున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రతిపాదించిన ఈ కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.ఈ పథకం కింద, ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాలంటీర్లను, డ్రోన్ ఆపరేటింగ్ నైపుణ్యాలు కలిగిన పారామిలిటరీ సభ్యులను నియమించనున్నారు. వీరు మానవరహిత విమానాలు, ఆయుధాలు వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రష్యా డ్రోన్లను పసిగట్టి, వాటిని కూల్చివేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చును స్థానిక బడ్జెట్ల నుంచి కేటాయించనున్నారు. దేశంలో మార్షల్ లా అమల్లో ఉన్నంతకాలం, అంటే దాదాపు రెండేళ్లపాటు ఈ పథకం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. సైన్యంపై భారం తగ్గించడంతో పాటు, రష్యా డ్రోన్ల ముప్పును మరింత సమర్థంగా ఎదుర్కోవచ్చని ఉక్రెయిన్ ప్రభుత్వం భావిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాలు డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యా, ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీనికి ప్రతిగా ఉక్రెయిన్ కూడా తన డ్రోన్ వ్యవస్థను గణనీయంగా పటిష్టం చేసుకుంటూ, ఇటీవల ‘స్పైడర్ వెబ్’ పేరుతో రష్యా భూభాగాలపై దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో, పౌరుల భాగస్వామ్యంతో డ్రోన్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ఉక్రెయిన్ వ్యూహంగా కనిపిస్తోంది.

Related posts

కువైట్ ఎయిర్ పోర్టులో భారతీయుల ఇబ్బందులు.. 19 గంటల పాటు పడిగాపులు!

Ram Narayana

అమెరికాలోని కాలిఫోర్నియా వాసులపై సేల్స్ ట్యాక్స్ ఎఫెక్ట్.. మధ్యతరగతిపై తీవ్ర ప్రభావం!

Ram Narayana

ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌లో ఆందోళన…

Ram Narayana

Leave a Comment