Road Accident
ప్రమాదాలు ...

ఖమ్మం-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం … ముగ్గురు సజీవ దహనం

  • మరిపెడ శివారులో ఢీకొన్న రెండు లారీలు
  • లారీ క్యాబిన్‌లో చెలరేగిన మంటలు, ముగ్గురు సజీవ దహనం
  • ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ అక్కడికక్కడే మృతి
  • మరో వ్యక్తికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న రెండు లారీలు అదుపుతప్పి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన మరిపెడ మండలం శివారులోని కుడియాతండా సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే… ఖమ్మం-వరంగల్ హైవేపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు ఓ లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో క్యాబిన్‌లో ఉన్న ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ బయటకు వచ్చే అవకాశం లేక మంటల్లోనే కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Related posts

బైకర్‌ను ఢీకొట్టిన మైనర్: మృతుడి తల్లిని జీవితాంతం క్షమాపణ కోరుతానన్న తండ్రి!

Ram Narayana

ఢిల్లీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 7గురు నవజాత శిశువుల దుర్మరణం…

Ram Narayana

కారు ప్రమాదం… బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయం

Ram Narayana