బిజినెస్ వార్తలు

ఈ-కామర్స్ వేదికలపై జీఎస్టీ తగ్గింపులపై ఓ కన్నేసిన కేంద్రం!

  • జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసర వస్తువుల నుంచి బైకులు, కార్ల వరకు తగ్గిన ధరలు
  • ధరల మార్పులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతోందన్న కేంద్రం 
  • కంపెనీలు పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకపోతే చర్యలు తప్పవన్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ఫలితంగా నిత్యావసర వస్తువుల నుంచి బైకులు, కార్ల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గాయి. పన్ను శ్లాబులను 5 శాతం, 18 శాతానికి పరిమితం చేయడం ద్వారా వినియోగదారులకు ధరల తగ్గింపు ప్రయోజనం చేకూరాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే, ఈ-కామర్స్ సంస్థలు ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ధరల మార్పులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు అమలు తీరును పరిశీలించి, సెప్టెంబర్ 30 నాటికి క్షేత్రస్థాయి నివేదిక అందుతుందని వివరించింది.

ధరల విషయంలో మొండిగా వ్యవహరిస్తే కంపెనీలపై చర్యలు తప్పవని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. యాంటీ-ప్రాఫిటీరింగ్ మెకానిజం అమల్లో ఉందని, పన్ను తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని సంకేతాలు పంపింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, కొన్ని సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయని, పన్ను తగ్గింపును పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయని తెలిపింది.

లగ్జరీ వస్తువులు, పొగాకు, మద్యం వంటి వాటిపై గరిష్టంగా 40 శాతం వరకు పన్ను విధిస్తున్న విషయం తెలిసిందే.

వినియోగదారులకు ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తున్నారని భావిస్తే, సంబంధిత యాంటీ-ప్రాఫిటీరింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం సూచించింది. 

జీఎస్టీ ప్రయోజనం అందడం లేదా?.. ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి!

GST Benefits Not Reaching You File a Complaint on These Numbers
  • జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందేలా కేంద్రం చర్యలు
  • ఫిర్యాదుల కోసం 1915 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు
  • వాట్సాప్ ద్వారా ఫిర్యాదుకు 88000 01915 నెంబర్ అందుబాటులోకి
  • 54 రకాల నిత్యావసర వస్తువుల ధరలపై ప్రత్యేక నిఘా
  • ధరల మార్పులపై ప్రతినెలా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
  • ఈ-కామర్స్ సంస్థలపైనా దృష్టి సారించిన ప్రభుత్వం

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల తర్వాత తగ్గిన ధరల ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందుతున్నాయో లేదో నిర్ధారించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. జీఎస్టీ కారణంగా తగ్గిన ధరలకు అనుగుణంగా వ్యాపారులు వస్తువులను విక్రయించని పక్షంలో, వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

వినియోగదారులు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి 1915 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను, 88000 01915 అనే వాట్సాప్ నెంబర్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎవరైనా వ్యాపారులు జీఎస్టీ ప్రయోజనాలను బదిలీ చేయకుండా అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తే, ఈ నెంబర్లకు ఫోన్ చేసి గానీ, వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపి గానీ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. వీటితో పాటు, ప్రభుత్వానికి చెందిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రీడ్రెసల్ మెకానిజం (ఐఎన్‌జీఆర్‌ఏఎం) పోర్టల్ ద్వారా కూడా తమ సమస్యలను తెలియజేయవచ్చు.

మరోవైపు, ప్రజలు ఎక్కువగా ఉపయోగించే 54 రకాల ఉత్పత్తుల ధరల మార్పులపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వెన్న, షాంపూ, టూత్‌పేస్ట్, ఐస్‌క్రీమ్, ఏసీ, టీవీ, సిమెంట్‌తో పాటు గ్లూకోమీటర్ వంటి కీలక వస్తువుల ధరలను నిశితంగా పరిశీలించాలని నిర్ణయించింది. ఈ ఉత్పత్తుల ధరల్లో వస్తున్న మార్పులపై ప్రతి నెలా తమకు నివేదిక సమర్పించాలని ఈ నెల 9వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో, తొలి నివేదికను సెప్టెంబర్ 30వ తేదీలోగా అందజేయాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ సంస్థలు కూడా తగ్గిన ధరలకే వస్తువులను అందిస్తున్నాయా లేదా అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది.

Related posts

పాన్‌కార్డులు మార్చేసిన కేంద్ర ప్రభుత్వం.. పాతవి పని చేయవా?

Ram Narayana

చెక్కుల క్లియరెన్స్ పై ఆర్బీఐ కొత్త విధానం!

Ram Narayana

చదరపు గజానికి రూ. 29 లక్షలా?.. అపార్ట్​ మెంట్లు ఇంత రేటా?

Ram Narayana