- ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ప్రకటించిన కాంగ్రెస్
- ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్లను కలుస్తున్న నవీన్ యాదవ్
- రాములు నాయక్, దానం నాగేందర్లను కూడా కలిసిన నవీన్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిలను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి చెందిన పలువురు నేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు.
జానారెడ్డితో పాటు రైతు కమిషన్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు: మల్లు భట్టివిక్రమార్క
- జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్
- నవీన్ యాదవ్కు పూర్తి మద్దతు ప్రకటించిన మల్లు భట్టివిక్రమార్క
- ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించాలని ఆకాంక్ష
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ అద్భుతమైన ఆధిక్యంతో గెలుపొందడం ఖాయమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థిగా నవీన్ యాదవ్ను ప్రకటించిన తర్వాత ఆయన భట్టివిక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నవీన్ యాదవ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికల సన్నాహాలు, ప్రజల అభిప్రాయాలు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. నవీన్ యాదవ్కు మల్లు భట్టి విక్రమార్క పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

