జాతీయ వార్తలు

సూసైడ్ చేసుకున్న ఐపీఎస్ అధికారి భార్య అమ్నీత్ పై ఎఫ్ఐఆర్…

  • హర్యానాలో సంచలనం సృష్టించిన ఐపీఎస్ పూరన్ కుమార్ సూసైడ్
  • రెండు రోజుల తర్వాత పూరన్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఏఎస్ఐ ఆత్మహత్య
  • తన భర్త ఆత్మహత్యకు పూరన్ కుమార్ భార్య కారణమంటూ ఏఎస్ఐ భార్య ఫిర్యాదు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమార్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత రెండు రోజులకు ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ రోహ్ తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ సూసైడ్ చేసుకున్నారు. తన భర్త మరణానికి ఐఏఎస్ అధికారి అమ్నీత్ కారణమంటూ ఏఎస్ఐ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పూరన్ అవినీతిపై తన భర్త విచారణ జరుపుతున్నాడని, అందుకే ఆయనపై పూరన్, అమ్నీత్ సహా ఉన్నతాధికారులు వేధింపులకు పాల్పడ్డారని సందీప్ భార్య ఆరోపించారు. అమ్నీత్ ను అరెస్టు చేసేంత వరకూ తన భర్తకు అంత్యక్రియలు జరబోమని చెబుతూ బంధువులతో కలిసి సందీప్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి ఆందోళన చేపట్టింది. సందీప్ భార్య ఫిర్యాదుతో పోలీసులు అమ్నీత్ కుమార్ పై కేసు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే..
కుల వివక్షతో ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని, తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ హర్యానా జైళ్ల శాఖ ఐజీ, ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని మరణించారు. తన భర్త మరణానికి కారణమైన హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్ తక్ ఎస్పీ బిజార్నియాను అరెస్టు చేయాలంటూ పూరన్ భార్య, ఐపీఎస్ ఆఫీసర్ అమ్నీత్ కుమార్ డిమాండ్ చేశారు. పూరన్ ఆత్మహత్య సంచలనంగా మారడంతో హర్యానా ప్రభుత్వం స్పందించి డీజీపీని సెలవుపై పంపడంతో పాటు రోహ్ తక్ ఎస్పీని సస్పెండ్ చేసింది.

పూరన్ కుమార్ మరణించిన రెండు రోజుల తర్వాత రోహ్ తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూరన్ కుమార్ అత్యంత అవినీతిపరుడని, తన అవినీతిపై విచారణ జరుగుతుండడంతో నిజాలు బయటపడతాయనే భయంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని సందీప్ కుమార్ తన సూసైడ్ లేఖలో ఆరోపించారు. డీజీపీ శత్రుజీత్ కపూర్ నిజాయితీపరుడని, పూరన్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేశాడని విమర్శించారు. పూరన్ కుమార్ అవినీతిపై విచారణ జరుపుతున్న తనకు తెలిసిన నిజాన్ని ప్రపంచానికి వెల్లడించాలనే ఉద్దేశంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పారు.

Related posts

వెజ్‌ శాండ్‌విచ్ ఆర్డరిస్తే నాన్‌ వెజ్ డెలివరీ.. రూ.50 లక్షల పరిహారానికి మహిళ డిమాండ్

Ram Narayana

ఎప్‌స్టీన్‌ ఫైళ్లలో అనిల్ అంబానీ పేరు… సంచలన విషయాలు వెల్లడి!

Ram Narayana

రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన.. వెండి నగల కోసం వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లిన దొంగలు!

Ram Narayana