- తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని మధ్య భగ్గుమన్న విభేదాలు
- టికెట్ కోసం చిన్ని అనుచరులకు డబ్బులిచ్చానంటూ కొలికపూడి సంచలన ఆరోపణ
- బ్యాంకు స్టేట్మెంట్ను వాట్సాప్ స్టేటస్గా పెట్టిన ఎమ్మెల్యే
- వివాదంపై దృష్టి సారించిన టీడీపీ అధిష్ఠానం
- ఇద్దరు నేతలను మంగళగిరికి పిలిచిన పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
- రేపు తేలనున్న కొలికపూడి-చిన్ని వివాదం
అధికార తెలుగుదేశం పార్టీలో ఓ కొత్త వివాదం కలకలం రేపుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎన్నికల టికెట్ కోసం ఎంపీ అనుచరులకు తాను డబ్బులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా ఆరోపించడం, అందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్ను తన వాట్సాప్ స్టేటస్గా పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.
టీడీపీ టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు అడిగారని కొలికపూడి ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బు ఇచ్చానంటూ, ఆ మేరకు బ్యాంక్ స్టేట్ మెంట్ ను తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టారు.
అయితే ఈ వివాదంపై టీడీపీ అధినాయకత్వం దృష్టి సారించింది. రేపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీనిపై పంచాయితీ చేయనున్నారు. రేపు పార్టీ కార్యాలయానికి రావాలంటూ ఎమ్మెల్యే కొలికపూడిని, ఎంపీ చిన్నిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిచారు.పల్లా ఇద్దరితో చర్చించిన అనంతరం, ఈ వివాదాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.

