ఆంధ్రప్రదేశ్

సాక్షికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్ల కొట్టివేత

  • ప్రివిలేజ్ కమిటీ నోటీసులను సవాల్ చేసిన సాక్షి
  • ఎడిటర్, రిపోర్టర్ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
  • ఎమ్మెల్యేల శిక్షణపై కథనం రాసినందుకు నోటీసులు
  • ఇది అపరిపక్వ దశ అని కోర్టు వ్యాఖ్య
  • కమిటీ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
  • ఏజీ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం

తమకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్, చీఫ్ రిపోర్టర్ దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్లు అపరిపక్వ దశలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారని పేర్కొంటూ మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఎమ్మెల్యేలకు నిర్వహించిన శిక్షణ తరగతులపై సాక్షి పత్రికలో ప్రచురితమైన ఓ కథనంపై వివరణ కోరుతూ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ బి.ఫణికుమార్ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, షోకాజ్ నోటీసు తర్వాత పలు దశలు ఉంటాయని గుర్తు చేశారు. పిటిషనర్ల వివరణను పరిగణనలోకి తీసుకుని విచారణను నిలిపివేయాలని కమిటీయే శాసనసభకు సిఫారసు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ వారికి వ్యతిరేకంగా సిఫారసు చేసినప్పటికీ, సమర్పించిన ఆధారాలు, వివరణను పరిగణనలోకి తీసుకుని శాసనసభ స్వతంత్రంగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

అంతకుముందు, శాసనసభ హక్కులకు సంబంధించిన ఆర్టికల్ 194, వాక్ స్వాతంత్ర్యానికి సంబంధించిన ఆర్టికల్ 19(1ఏ) మధ్య సంబంధంపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం వద్ద కేసు పెండింగ్‌లో ఉన్నందున కమిటీ ప్రక్రియను నిలుపుదల చేయలేమని అడ్వకేట్ జనరల్ (ఏజీ) వాదించారు. ఏజీ వాదనతో ఏకీభవిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో, పిటిషన్లు అపరిపక్వమైనవని పేర్కొంటూ వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.

Related posts

కెనడాలో దారుణం… గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో భారతీయ విద్యార్థి మృతి

Ram Narayana

అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానాలు వార్ …

Ram Narayana

మంత్రులందరికీ ఐప్యాడ్లు… ఇ-క్యాబినెట్ భేటీలపై సీఎం చంద్రబాబు నిర్ణయం!

Ram Narayana