ప్రమాదాలు ...

ఈవీ ఛార్జింగ్ పేలి భవనానికి మంటలు.. ఇండోర్​ లో ఏడుగురి సజీవ దహనం..!

ఇంటి బయట ఛార్జింగ్ కు పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనం(ఈవీ) పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉండటం అందరినీ కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం.. బృజేశ్వరి అనెక్స్ ప్రాంతంలోని ఓ మూడంతస్తుల నివాస భవనం బయట పార్క్ చేసిన ఎలక్ట్రిక్ కారుకు తెల్లవారుజామున 3:30 నుంచి 4 గంటల మధ్య ఛార్జింగ్ పెట్టారు. ఒక్కసారిగా ఆ ఛార్జింగ్ పాయింట్ వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.

క్షణాల్లోనే ఆ మంటలు భవనం మొత్తానికి వ్యాపించాయి. అదే సమయంలో ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 10 గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో మంటల తీవ్రత ఊహించని స్థాయికి చేరింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అగ్నిప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భవనానికి ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్ మొరాయించింది. దీంతో తలుపులు తెరుచుకోక బాధితులు బయటపడలేకపోయారు. లోపలే చిక్కుకుని పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. 

ఈ భవనం యజమాని మనోజ్ పుగాలియా పాలిమర్ వ్యాపారి కావడంతో ఇంట్లో పాలిమర్ మెటీరియల్ నిల్వ చేశారని, దాని వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్‌కు సంబంధించి నిపుణుల కమిటీతో విచారణ జరిపి, కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Related posts

హిమాచల్‌లో జల ప్రళయం .. 10 మంది మృతి, 34 మంది గల్లంతు

Ram Narayana

రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది దుర్మరణం…

Ram Narayana

వివాహ వేడుక నుంచి వస్తున్న ట్రక్కు నదిలో పడి 71 మంది జలసమాధి…

Ram Narayana