పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియన్తో మరోసారి ఫోన్లో సంభాషించారు. శనివారం జరిగిన ఈ ఫోన్ కాల్లో మోదీ ఇరాన్ ప్రజలకు ఈద్, నౌరూజ్ (పర్షియన్ నూతన సంవత్సరం) పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇరువురు నేతలు ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై కీలక అంశాలను చర్చించుకున్నారు. ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ ఘర్షణ పూరిత వాతావరణంలో ఉన్న నేపథ్యంలో ఈ సంభాషణకు దౌత్యపరంగా ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ సంభాషణ వివరాలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. “ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియన్తో మాట్లాడాను. ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ పండుగల సమయం పశ్చిమాసియాకు శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించాం” అని మోదీ తన పోస్ట్లో పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో శాంతియుత వాతావరణం నెలకొనాలని ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ చర్చల సందర్భంగా, పశ్చిమాసియాలోని కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు ప్రాంతీయ స్థిరత్వానికే కాకుండా, ప్రపంచ సరఫరా గొలుసులకు కూడా తీవ్ర అంతరాయం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో, అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి అయిన నౌకాయాన స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా, హర్మూజ్ జలసంధి వంటి కీలకమైన షిప్పింగ్ మార్గాలు ఎల్లప్పుడూ తెరిచి ఉండి, సురక్షితంగా ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.
ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రత, సంక్షేమానికి ఇరాన్ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తమ పౌరుల భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న సందేశాన్ని ఇది పరోక్షంగా తెలియజేసింది. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు భారత్ చేస్తున్న దౌత్య ప్రయత్నాల్లో ఇదొక ముఖ్యమైన ముందడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వివాదాల పరిష్కారానికి చర్చలే సరైన మార్గమని భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసినట్లయింది.
ఇదిలా ఉండగా, మార్చి 12న జరిగిన తొలి ఫోన్ సంభాషణలో కూడా ప్రధాని మోదీ పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, పౌరుల మరణాలు, మౌలిక సదుపాయాల విధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలన్నది భారత్ స్థిరమైన వైఖరి అని ఆయన స్పష్టం చేశారు. సరుకు రవాణా, ఇంధన సరఫరాకు ఆటంకాలు ఏర్పడితే భారత ఆర్థిక వ్యవస్థపై, ప్రాంతీయ స్థిరత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.