మానవ అంతరిక్ష యాత్రలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మరో చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. చంద్రుడి వద్దకు పంపిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా తన యాత్రను ముగించుకుని భూమికి తిరుగు ప్రయాణమైందని నాసా ప్రకటించింది. ఏప్రిల్ 1న నింగిలోకి దూసుకెళ్లిన ఈ స్పేస్క్రాఫ్ట్, చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి ప్రస్తుతం భూమి వైపు వస్తోంది. ఏప్రిల్ 10న రాత్రి 8:07 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్డౌన్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
సుమారు 50 ఏళ్ల తర్వాత మానవులను లోతైన అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఈ యాత్ర ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు—రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్—భూమి నుంచి 2,48,655 మైళ్ల దూరం ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో అపోలో-13 మిషన్ నెలకొల్పిన రికార్డును ఇది అధిగమించింది. యాత్రలో అత్యంత దూరపు పాయింట్కు చేరినప్పుడు భూమికి, స్పేస్క్రాఫ్ట్కు మధ్య దూరం 2,52,756 మైళ్లుగా నమోదైంది.
ఈ 10 రోజుల యాత్ర ముఖ్య ఉద్దేశం.. స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్, ఓరియన్ స్పేస్క్రాఫ్ట్ పనితీరును వ్యోమగాములతో లోతైన అంతరిక్ష వాతావరణంలో పరీక్షించడమే. భవిష్యత్తులో చంద్రుడిపైకి మళ్లీ మనుషులను పంపే లక్ష్యంలో ఈ మిషన్ ఒక కీలక ముందడుగు అని నాసా అధికారులు తెలిపారు. సరికొత్త సరిహద్దులను అన్వేషించాలన్న నాసా నిబద్ధతకు ఈ విజయం నిదర్శనమని నాసా అధికారి డాక్టర్ లోరీ గ్లేజ్ అన్నారు. భవిష్యత్తులో చంద్రుడిపై మానవ శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఆర్టెమిస్-2 యాత్ర మార్గం సుగమం చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.