- ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి టీచర్గా చేరిన లక్ష్మీరాజం
- సర్టిఫికెట్ రెన్యువల్ ఆలస్యమవ్వడంతో 8 నెలల తర్వాత తొలగింపు
- ప్రస్తుతం జీవనోపాధి కోసం భవన నిర్మాణ కార్మికుడిగా పని
- న్యాయం చేయాలంటూ జగిత్యాల కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైనం
- ఉన్నతాధికారుల ఆదేశాలతోనే చర్యలు తీసుకున్నామన్న డీఈఓ
టీచర్ ఉద్యోగం కోసం 11 ఏళ్ల ప్రభుత్వ కొలువును వదులుకున్న ఓ వ్యక్తి జీవితం… కేవలం రెండు రోజుల ఆలస్యం కారణంగా తారుమారైంది. జగిత్యాల జిల్లాకు చెందిన లక్ష్మీరాజం, 8 నెలల పాటు టీచర్గా పనిచేసిన తర్వాత ఉద్యోగం కోల్పోయి, ఇప్పుడు కుటుంబ పోషణ కోసం భవన నిర్మాణ కార్మికుడిగా మారారు.
2012లో వీఆర్ఏగా ప్రభుత్వ సేవలో చేరిన లక్ష్మీరాజం, ఆ తర్వాత వార్డు ఆఫీసర్గా పదోన్నతి పొందారు. అయితే, డీఎస్సీలో మంచి ర్యాంక్ రావడంతో టీచర్ కావాలనే ఆశతో తన మున్సిపల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2024 అక్టోబర్ 5న జరిగిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నాటికి ఆయన ఆర్సీఐ (రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) సర్టిఫికెట్ గడువు ముగిసింది. అయితే, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసిన పత్రాలు చూపించి, అక్టోబర్ 7న ఢిల్లీలో సర్టిఫికెట్ను రెన్యువల్ చేయించుకుని సమర్పించారు.
ఆ తర్వాత నియామక పత్రం అందుకుని అక్టోబర్ 16న విధుల్లో చేరారు. సుమారు 8 నెలలు పనిచేసిన తర్వాత, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ నాటికి రెన్యువల్ కాలేదన్న సాంకేతిక కారణంతో అధికారులు ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ నిర్ణయంతో తీవ్ర ఆవేదనకు గురైన లక్ష్మీరాజం హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ‘స్టేటస్ క్వో’ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఉద్యోగం లేకపోవడంతో, ప్రస్తుతం ఆయన సెంటరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం జగిత్యాల ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి, తనకు న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు.
దీనిపై జిల్లా విద్యాధికారి (డీఈఓ) రాము స్పందిస్తూ, వెరిఫికేషన్ రోజున ఆర్సీఐ సర్టిఫికెట్ రెన్యువల్ కాలేదని, ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఉన్నతాధికారుల ఆదేశాలతోనే చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. కలెక్టర్ జోక్యంతోనైనా తన సమస్య పరిష్కారమవుతుందని లక్ష్మీరాజం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.