బీజేపీ మతోన్మాద చర్యలకు చెంప పెట్టు కర్ణాటక ఫలితాలు…సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…
-బీజేపీకి మనుధర్మంపై భక్తి..మహిళలపై చిన్నచూపు….తమ్మినేని ఫైర్
-రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయాలని డిమాండ్
-కేరళ స్టోరీ లో వాస్తవాలను దాచిపెట్టారని విమర్శ
-కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతి వల్లనే ఓడింది
-బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన ప్రజలు పట్టించుకోలేదు
-ప్రధాని పర్యటించిన ఉపయోగపడలేదు
-పంచాయతీ సెక్రటరీల తొలగింపుపై ప్రకటన దుర్మార్గం
-దీనిపై మాట్లాడేందుకు సీఎం కు లేఖ రాసిన స్పందించకపోవడంపట్ల అసంతృప్తి
బీజేపీ మతోన్మాద చర్యలకు చెంపపెట్టులా కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు . బీజేపీ ప్రజలను ఎన్నిప్రలోభాలకు గురిచేసిన లెక్క చేయకుండా ప్రజలు బీజేపీకి తగిన బుద్ది చెప్పారని అన్నారు . లైంగిక వేధింపుల అవమానానికి గురైన మహిళా రేజ్లర్ల నిరసనను కేంద్రం పెడచెవిన పెడుతోందని ఫైర్ అయ్యారు . బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలని కోరుతూ మల్లయోధులు నెలరోజులుగా ఆందోళనలు, నిరాహార దీక్షలు చేస్తున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. బీజేపీకి మనుధర్మం అమలుపై ఉన్న భక్తి మహిళలపై లేదన్నారు. మహిళల పట్ల చిన్నచూపునకు నిదర్శనం ఈ ఘటన అని ఆరోపించారు. మహిళా రేజ్లర్లకు మద్దతుగా సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం తమ్మినేని మీడియాతో మాట్లాడారు. కనీసం ప్రజాస్వామ్య విలువలనూ పాటించడం లేదన్నారు. మరో వైపు ప్రతిపక్షాలపై బురదజల్లేందుకు ‘కేరళ స్టోరీ‘ అనే ఓ సినిమాను బయటకు వదిలారని చెప్పారు. ఈ సినిమాను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సకుటుంబ సపరివార సమేతంగా వీక్షించి కమ్యూనిస్టులు, ముస్లిం మతస్తులపైన అక్కసు వెళ్లగక్కాడన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి స్టోరీలు చాలా తీస్తామని సంజయ్ చెప్పడాన్ని తప్పబట్టారు. ‘కేరళ స్టోరీ’ సినిమాలో వాస్తవాలను దాచిపెట్టారని చెప్పారు. వాస్తవంగా కేరళ నుంచి ఐఎస్ఐలో చేరేందుకు నాలుగు జంటలు వెళ్లగా దానిలో ఒకటి ముస్లిం జంట కూడా ఉందన్నారు. నేషనల్ సెక్యూరిటీ పెట్టిన కేసు, ఐఎస్ఐ ఇబ్బందులకు గురిచేసిన నాలుగు జంటల్లో ముస్లిం జంటను విస్మరించి మూడు జంటలు పడ్డ ఇబ్బందులనే సినిమాలో చూపించి, మత మార్పిడి వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయనే తప్పుడు సంకేతం ఇచ్చేలా సినిమా రూపొందిస్తే..దానిని మోడీ ప్రభుత్వం కేరళ స్టోరీ రూపంలో తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. దీనిని అడ్టుపెట్టుకొని మోడీ ప్రభుత్వం బహిరంగంగా మతోన్మాదచర్యలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా మతోన్మాదాన్ని చాలా బహిరంగంగా ముందుకు తీసుకొస్తూ మోడీ ప్రచారం నిర్వహిస్తున్న తీరును ఆక్షేపించారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపి అవినీతికి ఆలవాలంగా నిలిచిందన్నారు. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ నిధులు 40 శాతం పక్కదోవ పట్టడంతో ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కర్ణాటక ఎన్నికల్లో మోడీ ప్రచారంలో భాగంగా ‘జై భజరంగబలి’ అంటూ నినాదాలు ఇస్తూ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలనే కుట్రపూరిత చర్యలకు పాల్పడటాన్ని ఖండిరచారు. ముఖ్యంగా ఢల్లీిలో పోరాడురున్న రెజ్లర్లకు మద్దతుగా, మోడీ ప్రభుత్వ దాష్టీకానికి నిరసనగా దిష్టిబొమ్మలు దహనం చేశామన్నారు. అప్రజాస్వామిక చర్యలు ఎక్కడున్నా సీపీఐ (ఎం) ఖండిస్తుందన్నారు.
పంచాయతీ సెక్రటరీల తొలగింపుపై ప్రకటన దుర్మార్గం
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు శనివారం మధ్యాహ్నంలోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు ఊడినట్లేనని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించడం చాలా దుర్మార్గమైన చర్యని తమ్మినేని విమర్శించారు. వాస్తవానికి రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ కు మించి ఉండదు..జేపీఎస్ ల విషయంలో దానిని మూడేళ్లు చేసినా ఆ సమయం కూడా పూర్తయిందన్నారు. రాష్ట్రంలో తొమ్మిది వేలకు పైగా ఉన్నా జూనియర్ పంచాయతీ సెక్రటరీలు నాలుగేళ్లయినా తమను రెగ్యులరైజ్ చేయకపోవడంపై ఆందోళన చేస్తున్నా ముఖ్యమంత్రి వారిని చర్చలకు పిలవకపోగా ఉద్యోగాల నుంచి తీసివేస్తామనడం దుర్మార్గపు చర్య అన్నారు. దీనిని తమ పార్టీ ఖండిస్తుందని చెప్పారు. తాను స్యయంగా సీఎంకు లేఖ రాశానన్నారు. ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేశానని చెప్పారు. అయినా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదన్నారు. జూనియర్ పంచాయతీ కార్మికులు వెంటనే చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మోడీ ప్రభుత్వ దుర్మార్గపూరిత చర్యలకు కర్ణాటక ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా మోడీ ప్రభుత్వ విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని దీనికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అంటూ మనుస్మృతిలో చెప్పటం కాదు…ఆచరణలోనూ మహిళలను గౌరవించాలి..వారిని దేవతల్లా పూజించాలని బీజేపీ శ్రేణులకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ హితబోధ చేశారు. మహిళల పట్ల బిజెపి నేతలకు ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా రేజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రమ్, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు యం.సుబ్బారావు, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనువాసరావు, బండారు రమేష్, ఆర్.ప్రకాష్, దోంగల తిరుపతిరావు,పి.రaాన్సీ,పిన్నింటి రమ్య, పార్టీ 2టౌన్, 3టౌన్, అర్బన్ మండలదర్శులు బోడపట్ల సుదర్శన్, భూక్యా శ్రీను, బత్తిన ఉంపేదర్, నాయకులు బండారు యాకయ్య, మీరా, కె అమరావతి. గౌస్, భాగం అజిత తదితరులు పాల్గొన్నారు.