తెలంగాణ వార్తలు

ఆర్టీసీ బిల్లు వివాదం: రాజ్ భవన్ ను ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు

  • బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలంటూ నినాదాలు
  • రాజ్ భవన్ వద్ద భద్రత పెంచిన ప్రభుత్వం
  • కార్మిక సంఘాల లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమిళిసై చర్చలు

తెలంగాణ ప్రభుత్వం పంపించిన ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ను ముట్టడించారు. నెక్లెస్ రోడ్ మీదుగా ర్యాలీగా వచ్చిన వేలాది మంది కార్మికులు రాజ్ భవన్ ముందు బైఠాయించారు. బిల్లుపై సంతకం చేసి ప్రభుత్వానికి పంపించాలని నినాదాలు చేస్తున్నారు. బిల్లులో అంశాలపై వివరణ సంగతి తర్వాత చూడొచ్చు ముందు బిల్లుకు ఆమోదం తెలపాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు పిలిచారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు.

కార్మికుల సంక్షేమం కోసమే తాను తపన పడుతున్నానని, వారికి అన్యాయం జరగకూడదనే ఆర్టీసీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తమిళిసై ఉదయం ట్విట్టర్ లో వెల్లడించారు. ఆర్టీసీ బిల్లుకు సంబంధించి ఐదు అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, గవర్నర్ లేవనెత్తిన సందేహాలకు ప్రభుత్వం వివరణ పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు కార్మిక సంఘాల చర్చల తర్వాత ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.

గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేయించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండడంతో ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కావడంతో ఆర్టీసీ బిల్లును పాస్ చేయించాలని ప్రయత్నిస్తోంది.

గవర్నర్ పై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు: ఈటల రాజేందర్

KCR Govt is targeting Gov Tamilisai says Etela Rajender

తెలంగాణలో మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఆర్టీసీ కార్మికులు కూడా ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకోవైపు బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ఆర్టీసీ విలీనం బిల్లు విషయంలో గవర్నర్ పై బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ హైదరాబాద్ లో లేరని చెపుతున్నా కేసీఆర్ ప్రభుత్వం హడావుడి చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. 

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని ఈటల చెప్పారు. గవర్నర్ కు ఈ బిల్లును మొన్ననే పంపారని… దాన్ని ఆమె చూడాలి, అధ్యయనం చేయాలి, సంతకం చేయాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులను బలవంతంగా రాజ్ భవన్ వద్దకు తీసుకొచ్చారని మండిపడ్డారు. వచ్చే ప్రభుత్వంలోనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు బకాయి పడ్డారని, ఆర్టీసీలో పని చేసే ఇతర సిబ్బందిని పర్మినెంట్ చేయాల్సి ఉందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శించారు.

Related posts

భద్రాచలం ఆలయ ఈవోపై దాడి .. కబ్జాదారులకు మంత్రి కొండా సురేఖ గట్టి హెచ్చరిక

Ram Narayana

ఐటీ రంగంలో భాగ్యనగరమే టాప్: ఐస్ప్రౌట్ వ్యవస్థాపకులు

Ram Narayana

‘ఆపరేషన్ స్మైల్’-XI కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీ

Ram Narayana