- గొడవ జరిగినప్పుడల్లా నల్లగా ఉన్నావంటూ భర్తపై తిట్లు
- భరించలేక కోర్టును ఆశ్రయించిన భర్త
- గృహహింస చట్టం కింద కేసు పెట్టిన భార్య
- ఆమె ఆరోపణలు నిరాధారమని తేలుస్తూ విడాకులు మంజూరు చేసిన కోర్టు
నల్లగా ఉన్నాడని భర్తను పదేపదే అవమానించడం క్రూరత్వం కిందికే వస్తుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేస్తూ ఓ జంటకు విడాకులు మంజూరు చేసింది. 2007లో వారికి వివాహమైంది. ప్రస్తుతం అతడి వయసు 44 ఏళ్లు కాగా, ఆమె వయసు 41 సంవత్సరాలు. వీరికి ఓ పాప కూడా జన్మించింది. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు పొడసూపాయి. మాటల మధ్యలో ఆమె భర్తను నల్లగా ఉన్నావని తిట్టేది. దీంతో విసుగు చెందిన ఆయన వేరుగా ఉంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు.
దీంతో ఆమె గృహహింస చట్టం కింద భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. ఆయనకు వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయని ఆరోపించింది. విడాకుల పిటిషన్ను ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చడంతో భర్త హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయస్థానం.. భర్తపై చేసిన వివాహేతర సంబంధాల ఆరోపణలు నిరాధారమైనవిగా పేర్కొంది. నల్లగా ఉన్నాడని భర్తను అవమానించడం క్రూరత్వమేనని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది.
పరస్పర అంగీకారంతో సహజీవనం చేసి, ‘రేప్’ అని ఆరోపిస్తే చెల్లదు: కర్ణాటక హైకోర్టు స్పష్టీకరణl
- దీన్ని సెక్షన్ 376 కింద శిక్షించలేమన్న ధర్మాసనం
- చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టీకరణ
- మహిళ దాఖలు చేసిన రెండు కేసులు కొట్టివేత
చట్టపరమైన ప్రక్రియ దుర్వినియోగానికి ఇదొక చక్కని ఉదాహరణగా పేర్కొంటూ, బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మహిళ దాఖలు చేసిన రెండు క్రిమినల్ కేసులను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఆరేళ్ల పాటు తనతో సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటాననే హామీని విస్మరించాడంటూ సదరు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.
‘‘ఏడాది కాదు, రెండు, మూడు, నాలుగు, ఐదేళ్లు కాదు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ఆరేళ్లపాటు అంగీకారంతో లైంగిక సంబంధం నిర్వహించారు. ఆరేళ్ల పాటు పరస్పర అంగీకారంతో లైంగిక కార్యం నిర్వహించడం అనేది అత్యాచారం కిందకు రాదు. సెక్షన్ 376 కింద శిక్షించలేం’’అని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. వీరు కలసిన మొదటి రోజు నుంచి 2019 డిసెంబర్ 27 వరకు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లు జస్టిస్ ఎం.నాగ ప్రసన్న పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు ఇందిరానగర్ పోలీసులు దాఖలు చేసిన రెండు కేసులను కొట్టి వేశారు…