జాతీయ వార్తలు

5 వేల సంవత్సరాలుగా భారత్ లౌకిక రాజ్యమే.. ఆరెస్సెస్ చీఫ్ భగవత్

  • ‘పృథ్వీ సూక్తా-యాన్ ఓడ్ టు మదర్ ఎర్త్’ పుస్తకాన్ని రచించిన ఆరెస్సెస్ కార్యకర్త
  • మనమంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటిచెప్పేలా దేశాన్ని తయారుచేయాలన్న భగవత్
  • లోక కల్యాణం కోసమే మునులు భారత్‌ను సృష్టించారన్న ఆరెస్సెస్ చీఫ్

భారత్ 5 వేల ఏళ్లుగా లౌకిక దేశమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. దేశ ప్రజలు కలిసి ఉండాలని, ప్రపంచం ముందు మానవ ప్రవర్తనకు అత్యుత్తమ ఉదాహరణగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆరెస్సెస్ కార్యకర్త రంగాహరి రచించిన ‘పృథ్వీ సూక్తా-యాన్ ఓడ్ టు మదర్ ఎర్త్’ పుస్తకావిష్కరణలో నిన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాతృభూమిపై భక్తి ప్రదర్శించాలని, ప్రేమగా, అంకితభావంతో మెలగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ ఐక్యతకు మాతృభూమిని మనం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. 

‘‘మన 5 వేల ఏళ్ల సంస్కృతి లౌకికమైనదే. అన్ని తత్వజ్ఞానాల్లోనూ ఇదే ఉంది. ఈ మొత్తం ప్రపంచం ఒకే కుటుంబమనేది మన భావన. ఇది సిద్ధాంతం కాదన్న విషయన్ని తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి’’ అని భగవత్ పేర్కొన్నారు. 

దేశంలో వైవిధ్యం చాలా ఉందని, ఒకరితో ఒకరు పోట్లాడుకోవద్దని సూచించారు. మనమంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ దేశాన్ని తయారుచేయాలని ఉద్బోధించారు. లోక కల్యాణం కోసమే మన మునులు భారత్‌ను సృష్టించారని, దేశంలోని చివరి వ్యక్తికి కూడా తమ జ్ఞానాన్ని అందించే సమాజాన్ని సృష్టించారని భగవత్ వివరించారు.

Related posts

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెట్టనున్న హమాస్.. అలర్ట్ అయిన ఇంటెలిజెన్స్!

Ram Narayana

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ఉత్తరం రాయడం ఓ మరపురాని అనుభూతి!

Ram Narayana

పీఎఫ్ డబ్బులు ఇక ఏటీఎం నుంచే.. ఉద్యోగులకు త్వరలో కొత్త సౌకర్యం!

Ram Narayana