- మావోయిస్టులకు చరిత్రలోనే అతి పెద్ద ఎదురుదెబ్బ
- దండకారణ్యంలో భారీ ఎన్ కౌంటర్
- 36 మంది నక్సల్స్ మృతి
- మృతుల వివరాలు వెల్లడించాలంటూ ఏపీ పౌర హక్కుల సంఘం డిమాండ్
మావోయిస్టు పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ నష్టం జరిగింది. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నిన్న 33 మంది మావోయిస్టులు మృతి చెందగా… ఇవాళ మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దాంతో, మరణించిన మావోయిస్టుల సంఖ్య 36కి పెరిగింది.
నిన్న మధ్యాహ్నం నుంచి దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మరణించిన మావోయిస్టులంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందినవారని తెలుస్తోంది.
మృతుల్లో మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు, దండకారణ్య రాష్ట్ర కమిటీ సభ్యులు తక్కల్లపల్లి వాసుదేవరావు ఉన్నట్టు భావిస్తున్నారు. వీరిద్దరూ సుదీర్ఘకాలంగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతున్నారు. వివిధ స్థాయిల్లో పనిచేసిన వీరిపై భారీ రివార్డులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మృతుల వివరాలను వెంటనే వెల్లడించాలని ఏపీ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది.
ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్లు హతం
ఛత్తీస్ గఢ్ లో నిన్న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. ఇప్పటి వరకు 36 మంది మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీ ఎత్తున కూంబింగ్ జరుగుతోంది.
మరోవైపు ఈ ఎన్ కౌంటర్లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. కమలేశ్ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందినవారు. ఊర్మిళది బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతంగా తెలుస్తోంది.
మరోవైపు ఈ భారీ ఎన్ కౌంటర్ పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను పోలీసులు వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది.