Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

కూటమి ప్రభుత్వ ఇసుక విధానంపై జగన్ ఫైర్

  • ఉచిత ఇసుక విధానంపై జగన్ సంచలన ట్వీట్
  • చంద్రబాబు సర్కార్ ఇసుక దోపిడీ చేస్తోందని ఆరోపణ 
  • చంద్రబాబుకు జగన్ ప్రశ్నల వర్షం

రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రజలకు ఉచిత ఇసుక లభించడం లేదని అన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు తీరు కూడా అలాగే ఉందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు.  

గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి? అని జగన్ నిలదీశారు. అందుకే చంద్రబాబునే అడుగుతున్నా.. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదన్నారు. అసలు ఇసుక‌ కొందామంటేనే గతంలో కంటే రేటు రెండింతలు ఉందన్నారు. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా? అంటూ జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైసీపీ ప్రభుత్వం స్టాక్‌ యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవక ముందే ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీల నేతలు దోచేయలేదా? కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. 

2014 – 19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయిందన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దీనికి సృష్టికర్త, మూలపురుషుడు మీరే కదా చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు, ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టు గా బిల్డప్‌ ఇచ్చారు, రెండు నెలలు కాకుండానే దాన్నీ రద్దుచేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు, చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారని ఆరోపించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారన్నారు. ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతి చోటా ఇసుకను కొల్లగొట్టి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. 

‘ఇప్పుడు కూడా జరుగుతున్నది సేమ్‌ టు సేమ్‌. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదు. పేరుకు ఉచితం అంటున్నారంటే.. మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు గారు, ఆయన ముఠా వల్ల, ముఠా కొరకు, ముఠా చేతుల మీదుగా నడుస్తోంది. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, దొంగ చాటుగా టెండర్లు పిలవడం నిజంకాదా? దేశంలో ఎక్కడా చూడని విధంగా ఉద్దేశపూర్వకంగా కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఇచ్చింది మీ స్వార్థం కోసం కాదా? ఎవ్వరినీ టెండర్లలో పాల్గొన కుండా దౌర్జన్యాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా?’ అంటూ జగన్ ప్రశ్నించారు. 

అదే గతంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేసింది. దోపిడీలకు అడ్డుకట్ట వేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించింది. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్‌ ఫాం మీద ఇ-టెండర్లు నిర్వహించింది. రీచ్‌ల వద్ద ఆపరేషన్‌ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేసింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసింది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుక రేట్లను ప్రకటించిందన్నారు. 

‘వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చింది. ప్రజలకు తక్కువ ధరకు ఒకవైపు ఇస్తూ మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేసింది. రేట్లపై సెబ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకుంది. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేసింది. మరి మీ హయాంలో ప్రభుత్వానికి ఒక్క రూపాయి రావటంలేదన్నది వాస్తవం కాదా? ప్రజలకూ ఉచితంగా అందడం లేదన్నది నిజం కాదా? ఇసుక ఉచితమే అయితే వైసీపీ హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి? మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు గారూ’ అంటూ జగన్ ప్రశ్నించారు.

Related posts

జగన్ కేబినెట్ లో ఈ 10 మందివి దశావతారాలు: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్

Ram Narayana

ఒంగోలు లో మాజీ ,తాజమద్య మాటల యుద్ధం ….

Ram Narayana

బాలకృష్ణకు ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు కౌంటర్

Ram Narayana

Leave a Comment