- వైసీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాలపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
- బాలినేని గొప్పగా అబద్ధాలు చెపుతున్నారన్న చెవిరెడ్డి
- ఎమ్మెల్సీ కోసం ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టారని వ్యాఖ్య
వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి తనను నిద్రలేపి ఫైల్ పై సంతకాలు చేయమన్నారని ఆయన చెప్పారు. అయితే తాను సంతకం చేయలేదని… ఆ మరుసటి రోజు కేబినెట్ లో విద్యుత్ ఒప్పందాలను ఆమోదించుకున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
బాలినేని వ్యాఖ్యలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని చెప్పారు. బాలినేని చాలా గొప్పగా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కొత్త పార్టీ (జనసేన) వాళ్ల మెప్పు పొందేందుకు బాలినేని ఇలా మాట్లాడి ఉండొచ్చని చెప్పారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు యూనిట్ కు రూ. 4.50తో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని… జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 2.48కి తగ్గించారని చెవిరెడ్డి తెలిపారు. అర్థరాత్రి తనను సంతకం పెట్టమన్నారని చెప్పడం బాధాకరమని అన్నారు. కేబినెట్ సమావేశంలో కొన్ని అంశాలు టేబుల్ అజెండాగా వస్తాయని… సభ్యుల ఆమోదంతో తీర్మానాలు అవుతాయని చెప్పారు.
ఏ కుటుంబం నుంచి బాలినేని ఈ స్థాయికి వచ్చారో… వారిపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెవిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో తనకు స్వేచ్ఛ లేదని బాలినేని చెప్పారని… ఇతర పార్టీల నేతలతో చార్టెడ్ ఫ్లయిట్ లో విదేశాలకు వెళ్లేంత స్వేఛ్చ ఆయనకు ఉండేదని చెప్పారు. జగన్ మీద అభాండాలు వేసి లబ్ధి పొందాలనుకుంటే… అది బాలినేనికే రివర్స్ అవుతుందని అన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఇప్పటికే బాలినేని కోట్లు ఖర్చు పెట్టారని అందరూ అనుకుంటున్నారని చెప్పారు.
.. వైసీపీ నేత చెవిరెడ్డికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాల్!

- ఎవరి మెప్పుకోసమో సెకీ ఒప్పందంపై మాట్లాడలేదన్న మాజీ మంత్రి
- సీఎండీ దస్త్రం కూడా తన వద్దకు రాలేదని వెల్లడి
- వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చానో చర్చకు సిద్ధమని వ్యాఖ్య
- దమ్ముంటే చర్చకు రావాలంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సవాలు
- చిత్తూరు జిల్లా నేతను తీసుకొచ్చి ఒంగోలులో నిలబెట్టడం నచ్చలేదని వెల్లడి
సెకీతో సౌరవిద్యుత్ ఒప్పందం అంశంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ విద్యుత్ శాఖ మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెప్పుకోసమే తాను సెకీ ఒప్పందంపై మాట్లాడానని విమర్శిస్తున్నారని, ఎవరి మెప్పు కోసమో తాను పనిచేయడం లేదని గుర్తుపెట్టుకోవాలని బాలినేని అన్నారు. సెకీతో ఒప్పందానికి సంబంధించి సీఎండీ దస్త్రం కూడా తన వద్దకు రాలేదన్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తాను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరూ తట్టుకోలేరని, తాను వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని, ధైర్యం ఉంటే చర్చకు రావాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన సవాల్ చేశారు.
రాజశేఖర్ రెడ్డి కుటుంబం వల్లే తాను పైకి వచ్చానంటూ మాట్లాడుతున్నారని, వైఎస్సే రాజకీయ భిక్ష పెట్టారని జనసేనలో చేరినప్పుడు తానే మీడియా ముఖంగా చెప్పానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావించారు. ‘‘నేను విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. వైఎస్పై అభిమానంతోనే మంత్రి పదవి వదులుకొని జగన్ పార్టీలోకి వెళ్లా. రాజశేఖర్ రెడ్డి మరణించాక మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని వదులుకున్నా. పవన్ వెంట ఉండి కూటమితో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను’’ అని ఆయన స్పష్టం చేశారు.
షర్మిల, విజయమ్మ వైఎస్ కుటుంబం కాదా?
రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఒక్క జగన్ మోహన్ రెడ్డేనా అని బాలినేని ప్రశ్నించారు. ‘‘షర్మిల, విజయమ్మ కాదా?. షర్మిల, విజయమ్మపై పోస్టులు పెడితే రాజశేఖర్ రెడ్డి కుటుంబం కానట్లు ఏమీ పట్టించుకోరా?’’ అని అన్నారు. ‘‘తిట్టేవాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని తీసుకొచ్చి ఒంగోలులో టికెట్ ఇస్తారా?. ఒంగోలులో పోటీ చేసే నాయకుడే లేరని చిత్తూరు జిల్లా నుంచి తెచ్చారా?. చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చి నిలబెట్టడం నాకు నచ్చలేదు. అందుకే ఒప్పుకోలేదు’’ అని ఆయన అన్నారు.
కాగా గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదయిన లంచం అభియోగాలకు సంబంధించి.. సెకీతో ఏపీ సౌరవిద్యుత్ ఒప్పందంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై నాటి విద్యుత్శాఖ మంత్రి, ప్రస్తుతం జనసేనలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించారు. సెకీ ఒప్పందం వెనుక ఇంత మతలబు ఉందని ఆనాడు ఊహించలేదని సందేహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఇంధనశాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీకాంత్ ఒక రోజు అర్ధరాత్రి ఒంటిగంటకు ఫోన్ చేసి సెకీతో ఒప్పంద పత్రాలపై సంతకం చేయమన్నారని, అనుమానం రావడంతో తాను చేయలేదని, ఆ తర్వాత కేబినెట్లో పెట్టి ఆమోదింపజేసుకున్నారని బాలినేని వెల్లడించారు.