- మహా కుంభమేళా ప్రాంతంలో ములాయం స్మృతి సేవా సంస్థాన్ శిబిరం
- శిబిరంలో మూడు అడుగుల ఎత్తున్న ములాయం విగ్రహం ఏర్పాటు
- విగ్రహాన్ని తొలగించాలన్న అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షుడు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా ప్రారంభమయింది. లక్షలాది మంది భక్తులు మహా కుంభమేళాకు తరలి వస్తున్నారు. మరోవైపు కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో ములాయం సింగ్ యాదవ్ స్మృతి సేవా సంస్థాన్ ఏర్పాటు చేసిన శిబిరంలో మూడు అడుగుల ఎత్తున్న ములాయం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, అఖిల భారత అఖాడా పరిషత్ ఆందోళనకు దిగింది.
అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపూరి మాట్లాడుతూ… హిందూ, సనాతన ధర్మ వ్యతిరేకి ములాయం సింగ్ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ పని చేశారు కాబట్టి… ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో తప్పులేదని… కానీ కుంభమేళా ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఏం సందేశాన్ని పంపించాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
ఈ అంశంపై సమాజ్ వాదీ పార్టీ నేత పాండే మాట్లాడుతూ… తమ నాయకుడి ఆశయాలు, ఆలోచనలను వ్యాప్తి చేయడానికే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కుంభమేళాకు వస్తున్న భక్తులకు తమ శిబిరం ద్వారా బస ఏర్పాటు చేసి ఆహారం అందిస్తున్నామని తెలిపారు. కుంభమేళా ముగిసిన తర్వాత ములాయం విగ్రహాన్ని పార్టీ కార్యాలయంలో ప్రతిష్టిస్తామని చెప్పారు.