- నాలుగు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్న రవాణాశాఖ
- 12 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించిన రవాణా శాఖ
- అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్న రవాణాశాఖ అధికారి
ట్రావెల్స్ బస్సులపై తెలంగాణ రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్న పలు ట్రావెల్స్ సంస్థలపై 300కు పైగా కేసులు నమోదు చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రైవేటు రవాణా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను తిప్పుతున్నట్లు గుర్తించిన రవాణా శాఖ నాలుగు రోజులుగా తనిఖీలు చేపడుతోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్, ఆరాంఘర్ వద్ద తనిఖీల సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ మేరకు రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.
తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. సంక్రాంతి పండుగ సమయంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఇష్టానుసారంగా ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టామని, ఇదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై దృష్టి సారించామన్నారు.