ఖమ్మంలో జ్యోతిరూపంలో అయ్యప్ప దర్శనం …
పవిత్రతకు నిదర్శనం అని నమ్ముతున్న భక్తులు
ఈసంవత్సరం 40 వేలమందికి అన్నప్రసాదాలు
12 వేలమంది దీక్షాపరులకు మాలధారణ …6500 మందికి ఇరుముడి
నాలుగు దశాబ్దాల క్రితం ఖమ్మం పట్టణం శ్రీనివాసనగరంలో కీ.శే. వంగవీటి టాగూర్ కన్నయ్య ప్రభాకర్ గారి నేతృత్వంలో ప్రతిష్ఠింపబడిన అయ్యప్ప స్వామి ఆలయం భక్తజనాలకు శాశ్వతంగా ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. జన్మతః పరాక్రమ సూరుడైన అయ్యప్ప స్వామి ధర్మాచరణకు ప్రతీకగా నిలుస్తూ, భక్తులకు పునీతం ప్రసాదిస్తున్నాడు.
“కర్మ సిద్ధాంతం జీవన విధానం” అన్న సిద్ధాంతాన్ని ఆచరించాలనే సందేశం ఇచ్చిన స్వామి, భక్తుల ప్రగాఢ విశ్వాసానికి ప్రతీకగా, ఆయనను దర్శించడంలో పుణ్యఫలం కలుగుతుందని నమ్మకం. భక్తులు మండలం రోజుల దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం చేసుకుంటారు.
నాటి నుంచి నేటి వరకు కేరళ సాంప్రదాయ పూజావిధానాలతో ఆలయంలో పూజలు నిర్వహించబడుతున్నాయి. ఆలయ నిర్వహణలో ప్రధాన అర్చకులు శ్రీ పాకతిల్లం నారాయణస్వామి, పాలక మండలి చైర్మన్ శ్రీ చిల్లంచర్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి రాయపూడి వెంకట రమణ, కోశాధికారి పసుమర్తి రంగా రావు, సభ్యులు కాకరపర్తి రామ్ ప్రతాప్, మేళ్లచెరువు మనోజ్ కుమార్, కటకం రాము, వంగవేటి రఘు, కర్లపాటి నాగేశ్వరరావు కారుమూరి నరేందర్ తదితరులు విశేష కృషి చేస్తున్నారు.
ప్రతి ఏడాది వేలాది భక్తులు దీక్ష స్వీకరించి, స్వామి దర్శన భాగ్యాన్ని పొందుతారు. ఈ సంవత్సరం దాదాపు 12,000 మంది దీక్షాపరులకు మాలధారణ, 6,500 మందికి ఇరుముడి సేవలు, 40,000 మంది భక్తులకు అన్నప్రసాదం వంటి సేవలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి.
భక్తుల అంకితభావంతో, వితరణశీలుల సహకారంతో, అయ్యప్ప స్వామి జ్యోతి రూపంగా భాసిల్లుతూ, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ నిలుస్తున్నాడు.