- ప్రభుత్వం మారితే ఇందులోని అవినీతి ప్రజలకు తెలుస్తుందన్న కేజ్రీవాల్
- ఇది నకిలీ స్కీం అంటూ సుప్రీంకోర్టు ధృవీకరించిందన్న కేజ్రీవాల్
- ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలుపై కోర్టుకెక్కిన బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ
కేంద్రంలో ప్రభుత్వం మారి దర్యాఫ్తు చేపడితే ఆయుష్మాన్ భారత్ పథకంలో జరిగిన భారీ అవినీతి గురించి ప్రజలకు తెలుస్తుందని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ… ఆయుష్మాన్ భారత్ అతిపెద్ద కుంభకోణమన్నారు. ఇది నకిలీ స్కీమ్ అని సుప్రీంకోర్టు ధృవీకరించడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభీమ్)ను ఢిల్లీలో అమలు చేయడానికి జనవరి 5లోగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఒప్పందంపై సంతకం చేయాలని గత డిసెంబర్ 24న ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
దీనిని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్తో కూడిన ధర్మాసనం ఈరోజు ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ఆయుష్మాన్ భారత్ను అమలు చేయడానికి ఒప్పందం చేసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. కేంద్రం, ఇతరుల స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది.