- టెక్సాస్ నుంచి ఫ్లోరిడా, నార్త్ కరోలినా వరకు విస్తరించిన మంచు తుపాను
- గడ్డకట్టుకుపోయిన పలు నగరాలు
- నేడు కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణశాఖ
దక్షిణ అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని దెబ్బకు ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ నుంచి ఫ్లోరిడా, నార్త్ కరోలినా వరకు విస్తరించిన తుపాను ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. రికార్డుస్థాయిలో కురుస్తున్న మంచు కారణంగా న్యూఓర్లీన్స్, అట్లాంటా, జాక్సన్విల్లే నగరాలు గడ్డకట్టుకుపోయాయి.
విపరీతంగా కురుస్తున్న మంచుకు తోడు చలిగాలులు వణికిస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి మధ్య పశ్చిమ, తూర్పు అమెరికా ప్రాంతాల మీదుగా వీస్తున్న గాలి వాతావరణం గడ్డకట్టదానికి కారణమవుతోంది. ఫలితంగా పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
న్యూఓర్లీన్స్లో రికార్డుస్థాయిలో 10 అంగుళాల (25 సెంటీమీటర్లు) మేర మంచు కురిసింది. జాతీయ వాతావరణ సేవల విభాగం ప్రకారం అలస్కాలో డిసెంబరు నుంచి కురుస్తున్న హిమపాతాన్ని ఇది అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది. నేడు కూడా ఇక్కడ శీతల ఉష్ణోగ్రతలు, చల్లని గాలుల తీవ్రత కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది.