- ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్న కుమారస్వామి
- స్టీల్ ప్లాంట్ ను నెంబర్ వన్ ప్లాంట్ గా మారుస్తామని వ్యాఖ్య
- మూడు నెలల్లోగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్న కేంద్ర మంత్రి
ఆధునికీకరణ, విస్తరణ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి తెలిపారు. విస్తరణ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు భారంగా మారాయని చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభమైన తర్వాత ఉత్పత్తి తగ్గిందని అన్నారు.
ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కు రూ. 35 వేల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, ప్లాంట్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహించి నెంబర్ వన్ ప్లాంట్ గా మారుస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని సమర్థవంతంగా వినియోగించడంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
కార్మికుల సమస్యలను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని, సహకరించాలని కోరానని… దానికి యూనియన్లు అంగీకరించాయని తెలిపారు. 15 రోజుల్లోగా వర్కింగ్ ప్లాన్ ప్రకటిస్తామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పటిష్టం చేయడం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని అన్నారు.
కుమారస్వామి కాన్యాయ్ లో ప్రమాదం… దెబ్బతిన్న జీవీఎల్ నరసింహారావు కారు
- విశాఖ పర్యటనకు వచ్చిన కుమారస్వామి
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళుతుండగా కాన్వాయ్ లో ప్రమాదం
- స్వల్పంగా దెబ్బతిన్న కాన్వాయ్ లోని మూడు వాహనాలు
విశాఖపట్నం పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి కాన్వాయ్ లో తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మలకు ఎయిర్ పోర్టులో ఎంపీలు భరత్, అప్పలనాయడు, ఇతర టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారి కుమారస్వామి రావడంతో ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ పలికారు.
అక్కడి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు వెళుతున్న సమయంలో కాన్వాయ్ లోని మూడు వాహనాలు ఒకదానితో మరొకటి గుద్దుకున్నాయి. మొత్తం ఎనిమిది వాహనాల కాన్వాయ్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ వాహనాల్లో ఒకటి మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుది కావడం గమనార్హం. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.