జాతీయ వార్తలు

సాంకేతిక యుగంలో సంప్రదాయ బడ్జెట్.. చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి!

  • చేతిరాతతో బడ్జెట్ రూపొందించిన ఛత్తీస్‌గఢ్ మంత్రి
  • 1.65 లక్షల కోట్ల బడ్జెట్‌ సమర్పణ
  • బడ్జెట్ రూపొందించడానికి నాలుగు రోజుల పాటు నిద్రకు కరవు 
  • పారదర్శకతకు చేతిరాత బడ్జెట్ నిదర్శనమని వ్యాఖ్య 

ఛత్తీస్‌గఢ్ ఆర్థిక మంత్రి ఒ.పి. చౌధరి తన ప్రత్యేక శైలితో వార్తల్లో నిలిచారు. నేటి హైటెక్ యుగంలోనూ ఆయన చేతిరాతతోనే పూర్తి బడ్జెట్‌ను రూపొందించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను సుమారు రూ.1.65 లక్షల కోట్లతో ఆయన శాసనసభకు సమర్పించారు.

సాధారణంగా బడ్జెట్ పత్రాలను అధికారులు కంప్యూటర్ల ద్వారా రూపొందిస్తుంటారు. అయితే, చౌధరి మాత్రం తన భావాలు, దార్శనికత, రాష్ట్రం పట్ల తన నిబద్ధతను చేతిరాత ద్వారానే మరింత స్పష్టంగా వ్యక్తం చేయగలనని భావించారు. అందుకే వంద పేజీల బడ్జెట్‌ను స్వయంగా హిందీలో రాశారు.

ఈ బడ్జెట్ రూపకల్పన కోసం ఆయన దాదాపు నాలుగు రోజులపాటు రోజుకు గంట లేదా గంటన్నర మాత్రమే నిద్రపోయారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే తాను ఐఏఎస్ అధికారిగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని చౌధరి పేర్కొన్నారు. చేతితో రాసిన బడ్జెట్ పత్రం పారదర్శకతకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. బడ్జెట్ తయారీకి దాదాపు 5-6 నెలల సమయం పట్టిందని, అయితే బడ్జెట్‌లోని అంశాలను మాత్రం చివరి 10 రోజుల్లో రాశానని ఆయన తెలిపారు.

2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా పనిచేసిన చౌధరి, 2018లో రాయ్‌పూర్ కలెక్టర్‌గా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2018లో ఓడిపోయినప్పటికీ, 2023లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టారు.

Related posts

ఉన్నత విద్యలో జనరల్‌ను దాటేసిన రిజర్వ్డ్ విద్యార్థులు!

Ram Narayana

ఆపరేషన్ సిందూర్‌లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డ్రోన్లు ఉపయోగించారు : గౌతమ్ అదానీ

Ram Narayana

చెన్నైలో రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు…

Ram Narayana