ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

వక్ఫ్ బిల్లుపై టీడీపీ వర్సెస్ వైసీపీ ..ఇది నిజం ఏది అబద్దం …

వక్ఫ్ బిల్లుపై వైసీపీ డబుల్ గేమ్ అంటూ టీడీపీ విమర్శల దాడి

  • లోక్‌సభలో బిల్లుకు వ్యతిరేకంగా, రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసిందంటూ టీడీపీ విమర్శ
  • జగన్ తల్లిని, చెల్లినే కాదు .. ముస్లింలను కూడా మోసం చేశారంటూ నక్కా ఆనందబాబు విమర్శ 
  • ముస్లిం సమాజంపై వైసీపీ మోసపూరిత విధానం బయటపడిందన్న నాగుల్ మీరా

వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ ద్వంద్వ ప్రమాణాలు అవలంబించిందని, ముస్లింలను నమ్మించి మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్లమెంటులో చెప్పించి, ఓటింగ్ సమయంలో లోక్‌సభలో వ్యతిరేకంగా ఓటు వేసి, రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసి జగన్ ముస్లింలను మోసం చేశారని టీడీపీ దుయ్యబట్టింది.

వక్ఫ్ బిల్లుకు తాము వ్యతిరేకమని వైసీపీ నేతలతో మాట్లాడించిన జగన్, రాజ్యసభలో మాత్రం తన ఎంపీలను బిల్లుకు మద్దతుగా ఓటు వేయమని చెప్పారని టీడీపీ విమర్శించింది. ఇది ముస్లింలకు తెలిసి వారు షాక్ నుంచి తేరుకోకముందే విప్ జారీ అంటూ నాటకానికి తెరదీశారని మండిపడింది. చేసిందంతా చేసి ఓటింగ్ తర్వాత విప్ జారీ చేయడం ఏమిటని ముస్లింలు ప్రశ్నిస్తున్నారని టీడీపీ పేర్కొంది.

వైసీపీపై ఎక్స్ వేదికగా టీడీపీ ఈ అంశంపై విమర్శలు గుప్పించింది. టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద బాబు మీడియా సమావేశాల్లో వైసీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ, జగన్ తీరును తూర్పారబట్టారు.

జగన్ తల్లిని, చెల్లినే కాదని, ముస్లింలను కూడా మోసం చేశారని నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ రెడ్డి మాటలు ఒకలా ఉంటే చేతలు మరోలా ఉంటాయని నాగుల్ మీరా విమర్శించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందని ఆయన విమర్శించారు. ముస్లిం సమాజంపై వైసీపీ మోసపూరిత విధానం బయటపడిందని ఆయన అన్నారు. 

వక్ఫ్ బిల్లును వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ముందా.. టీడీపీకి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్

YV Subba Reddy Challenges TDP on Wakf Bill
  • టీడీపీ విమర్శలను ఖండించిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
  • బిల్లును తాము వ్యతిరేకించామనడానికి లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన కార్యకలాపాలే సాక్ష్యమని వెల్లడి
  • ఫేక్ న్యూస్‌ల మీద రాజకీయాలు చేసే అలవాటు టీడీపీకి ఉందని కౌంటర్    

వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైసీపీ డబుల్ గేమ్ ఆడి ముస్లింలను మోసం చేసిందంటూ టీడీపీ, ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన టీడీపీకి సవాల్ విసిరారు.

వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో తాము వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా? అని సవాల్ విసిరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ పార్టీ విప్ జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

వక్ఫ్ సవరణ బిల్లును తాము వ్యతిరేకించామనడానికి లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన కార్యకలాపాలే సాక్ష్యమని, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై తాను చేసిన ప్రసంగం మరో ప్రత్యక్ష సాక్ష్యమని వైవీ పేర్కొన్నారు. బిల్లును వైసీపీ వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా అని ఆయన నిలదీశారు. ఫేక్ న్యూస్‌ల మీద రాజకీయాలు చేసే అలవాటు టీడీపీకి ఉందని వైవీ విమర్శించారు. 

Related posts

న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు అని నిలదీద్దాం… నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పిలుపు

Ram Narayana

రాయి కొంచెం పక్కకి తగిలి ఉంటే ప్రాణం పోయేది… కొంచెం కింద తగిలి ఉంటే కన్ను పోయేది: సజ్జల

Ram Narayana

 నా తండ్రి కేశినేని నాని పట్ల టీడీపీ నేతలు అవమానకరంగా వ్యవహరించారు: కేశినేని శ్వేత

Ram Narayana