- జూన్ 2 నుంచి9 వరకు యువ వికాసం అనుమతి పత్రాలు
- మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి చర్యలు
- సన్న బియ్యానికి ఏడాదికి 13,525 కోట్లు వెచ్చిస్తున్నాం
- సన్న బియ్యంతో 3.10 కోట్ల మంది పేదలకు లబ్ది
- గత పాలకులు సన్న బియ్యం పాట పాడారు తప్ప ఇవ్వ లేదు
- సన్నధాన్యం బోనస్ కు 2,675 కోట్లు ఖర్చు చేస్తున్నాం
- సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం
- మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
ప్రభుత్వ ఉద్యోగాలు రాక మిగిలి పోయిన నిరుద్యోగులకు రూ. 9,000 కోట్లతో రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. జూన్ 2 నుంచి9 వరకు యువ వికాసం పథకం అనుమతి పత్రాలను అన్ని నియోజక వర్గ, మండల కేంద్రాల్లో పంపిణీ చేస్తామన్నారు. ఆదివారం మధిర నియోజక వర్గ పర్యటనకు వచ్చిన ఆయన తన క్యాంపు కార్యాకయంలో మీడియాతో మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రకటించిన నాటి నుండి సాంక్షన్ లెటర్ ఇచ్చేవరకు క్యాలెండర్ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. ప్రకటించిన క్యాలెండర్ను తూచా తప్పకుండ పాటిస్తామని భట్టి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాసం కింద ఎంచుకున్న పథకానికి కనీసం మూడు రోజుల నుంచి వారం రోజుల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత, గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. నిరుద్యోగుల కలలు నిజం చేసే క్రమంలో ఇప్పటికే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసామని, మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని డిప్యూటీ సీఎం బట్టి వెల్లడించారు. ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు. గత పాలకులు 8 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగిస్తే వాటన్నిటినీ సరి చేసుకుంటూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదన్నారు. గత పాలకులకు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పది సంవత్సరాలపాటు సన్న బియ్యం పాట పాడారు తప్ప, గింజ కూడా పంపిణీ చేయలేదని విమర్శించారు. పేద వర్గాలకు సన్న బియ్యం పంపిణీ దేశంలో ఎక్కడా జరగడం లేదన్నారు. సన్న బియ్యంతో తినాలని ఆశగా ఎదురు చూసే వారికి గత ఉగాది నుంచి రాష్ట్రంలోని 90 లక్షల రేషన్ కార్డులు ఉన్న 2.85 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇవే కాకుండా కొత్తగా రాబోవు రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో ఒక కోటి రేషన్ కార్డులకు చెందిన 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందించే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. నిరుపేదలకు సన్న బియ్యం అందించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం13,525 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. పేద ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత, అంకిత భావాన్ని ఈ పథకం తెలియజేస్తుందని అన్నారు. కనీ వినీ ఎరుగని గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని తెలిపారు. గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి గింజను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రజలను ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా, సన్న ధాన్యం సాగు చేసే రైతులకు మరో వైపు బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,675 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలు చేపడుతూనే ఇంకో వైపు రైతు రుణ మాఫీ కోసం రూ. 21 వేల కోట్లు, రైతు భరోసాకు రూ. 18 వేల కోట్లు, సన్న ధాన్యం బోనస్ గా రూ. 2,675 కోట్లు, వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ కోసం రూ. 12,500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, హస్తకళల బోర్డు చైర్మన్ నాయుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.