- వివరాలు వెల్లడించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
- ప్రధాని రాక పోవడాన్ని ప్రశ్నించిన మల్లిఖార్జున ఖర్గే
ఢిల్లీ పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు అఖిల పక్ష సమావేశం కొనసాగింది. అన్ని పార్టీలకు ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను కేంద్ర ప్రభుత్వం అందించింది. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు. ఈ సమావేశానికి అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతరామన్, జైశంకర్, కిరణ్ రిజిజు, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ అంతటా ఉగ్రవాద లక్ష్యాలపై భారత సాయుధ దళాలు ఖచ్చితమైన సైనిక దాడులు ఎలా నిర్వహించాయో, మురిడ్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, బహవల్పూర్లోని ప్రధాన ఉగ్రవాద శిక్షణా ప్రదేశాలు వంటి వాటి గురించి కేంద్రం అన్ని పార్టీలకు వివరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశం మేరకు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, పాకిస్తాన్పై సైన్యం తీసుకుంటున్న చర్యల గురించి అన్ని రాజకీయ పార్టీలను నమ్మకంగా ఉంచడం చాలా అవసరమని అన్నారు. అయితే, సమావేశానికి ముందు, కాంగ్రెస్ నాయకులు అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి లేకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు భారతదేశం సరైన ప్రతీకార చర్యను ప్రధానమంత్రి ఇప్పటికే ప్రపంచానికి చూపించారని బిజెపి చెప్పడంతో దీనిని తోసి పుచ్చింది. బుధవారం, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఇద్దరు మహిళా అధికారులతో కలిసి, సైన్యం సైనిక దాడులను ఖచ్చితత్వంతో అమలు చేయడం, ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడం, సరిహద్దు వెంబడి ఉగ్రవాదులను తటస్థీకరించడం ద్వారా పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవడం గురించి దేశానికి వివరించారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో నేపాలీ జాతీయుడు సహా 26 మంది పౌరులు మరణించారు.