ఏపీ హైకోర్టు వార్తలు

నంబాల కేశవరావు, సజ్జ నాగేశ్వరరావు మృతదేహాల కోసం హైకోర్టులో పిటిషన్!

  • ఏపీ హైకోర్టులో నంబాల, సజ్జ బంధువుల పిటిషన్
  • మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందన్న ఛత్తీస్ గఢ్ అడ్వొకేట్ జనరల్
  • ఛత్తీస్ గఢ్ అధికారులను సంప్రదించాలన్న హైకోర్టు

ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, అలాగే సజ్జ నాగేశ్వరరావు మృతదేహాలను తమకు అప్పగించాలని కోరుతూ వారి బంధువులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారు నిన్న హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.

విచారణ సందర్భంగా, ఛత్తీస్‌గఢ్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని న్యాయస్థానానికి తెలిపారు. మొత్తం 21 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆయన వివరించారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ, ఎన్‌కౌంటర్ ఘటన ఛత్తీస్‌గఢ్ పరిధిలో జరిగింది కాబట్టి, పిటిషనర్లు అక్కడి న్యాయస్థానాన్నే ఆశ్రయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం కీలక సూచనలు చేసింది. పోస్టుమార్టం ప్రక్రియ ముగిసినందున, మృతదేహాలను అప్పగించే అవకాశం ఉందని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చెబుతున్నందున, పిటిషనర్లు నేరుగా అక్కడి అధికారులను సంప్రదించవచ్చని తెలిపింది. ఈ మేరకు పిటిషనర్లకు న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో తదుపరి చర్యల కోసం పిటిషనర్లు ఛత్తీస్‌గఢ్ అధికారులను సంప్రదించాల్సి ఉంది.

Related posts

నలుగురు ఐఏఎస్‌లకు ఏపీ హైకోర్టు బెయిలబుల్ వారెంట్‌!

Ram Narayana

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..!

Ram Narayana

ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పై హైకోర్టుకు సిట్!

Ram Narayana