జనరల్ వార్తలు ...

ఫ్లయిట్ మిస్సయిన కిడ్నీ పేషెంట్ … తన చార్టర్డ్ విమానంలో పంపించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

  • కిడ్నీ మార్పిడి రోగికి ఆపదలో ఆదుకున్న డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే
  • ఫ్లైట్ మిస్సయిన మహిళకు తన ప్రత్యేక విమానంలో ముంబై ప్రయాణ ఏర్పాట్లు
  • జలగావ్ నుంచి ముంబైకి శుక్రవారం రాత్రి ఘటన
  • ముఖ్యమంత్రి వైద్య సహాయ విభాగాన్ని ఆశ్రయించిన బాధితురాలు
  • షిండే చొరవతో అర్ధరాత్రికి ముందే ఆసుపత్రికి చేరిన మహిళ

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అత్యవసరంగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స అవసరమైన ఓ మహిళకు, అనుకోకుండా విమానం అందుకోలేకపోయిన క్లిష్టపరిస్థితుల్లో అండగా నిలిచారు. శుక్రవారం రాత్రి తన ప్రత్యేక విమానంలో ఆమెను జలగావ్ నుంచి ముంబైకి తరలించి, సకాలంలో వైద్యం అందేలా చూశారు. జలగావ్ జిల్లాకు చెందిన శీతల్ బోర్డే అనే మహిళకు ముంబైలోని ఓ ఆసుపత్రిలో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. ఇందుకోసం ఆమె శుక్రవారం అర్ధరాత్రిలోగా ముంబై చేరుకోవాల్సి ఉండగా, దురదృష్టవశాత్తు విమానం అందుకోలేకపోయారు. సమయం మించిపోతే తనకు అందాల్సిన మూత్రపిండం వేరొకరికి కేటాయించే ప్రమాదం ఉండటంతో, ఆమె వెంటనే ముఖ్యమంత్రి వైద్య సహాయ విభాగాన్ని (సీఎం మెడికల్ అసిస్టెన్స్ సెల్) ఆశ్రయించారు. అదే సమయంలో, ముక్తాయినగర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, జలగావ్ విమానాశ్రయం నుంచి ముంబైకి తిరిగి ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. శీతల్ బోర్డే పరిస్థితి గురించి తెలుసుకున్న ఆయన తక్షణమే స్పందించారు. వాస్తవానికి, షిండే ప్రయాణించాల్సిన విమానం కూడా సాంకేతిక కారణాలు మరియు పైలట్ల విధి నిర్వహణ సమయం ముగియడం వంటి సమస్యలతో కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ, ఉప ముఖ్యమంత్రి షిండే, జలవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్‌తో చర్చించి, పౌర విమానయాన శాఖ అధికారులతో మాట్లాడారు. పైలట్లకు అవసరమైన వైద్య పరీక్షలతో సహా అన్ని తప్పనిసరి ప్రక్రియలు త్వరితగతిన పూర్తిచేయించి, విమానం నడిపేందుకు ప్రత్యేక అనుమతులు పొందారు. రాత్రి సుమారు 9:50 గంటలకు జలగావ్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానంలో శీతల్ బోర్డేను ముంబైకి పంపించారు. జలగావ్ కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, “ఉప ముఖ్యమంత్రి చొరవతో ఆ మహిళ అర్ధరాత్రికి ముందే ముంబైలోని ఆసుపత్రికి సకాలంలో చేరుకున్నారు” అని తెలిపారు. ఆపద సమయంలో డిప్యూటీ సీఎం షిండే చూపిన చొరవ, సకాలంలో స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.

Related posts

Go Simple With Jeans

Ram Narayana

నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో పీహెచ్‌డీ‌.. ఆశావహులకు యూజీసీ గుడ్‌న్యూస్!

Ram Narayana

3,395 కరోనా కేసులు.. ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు!

Ram Narayana