- ఆయేషా మీరా హత్య కేసును ముగించిన విజయవాడ సీబీఐ కోర్టు
- ఆమె అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించాలని కీలక ఆదేశం
- ఫిబ్రవరి 27న తెనాలిలో అంత్యక్రియలు జరపాలని నిర్దేశం
- ప్రభుత్వ భద్రత నడుమ అంత్యక్రియలు జరపాలని స్పష్టం చేసిన న్యాయస్థానం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం.. వైద్య బృందం సేకరించిన ఆయేషా భౌతిక అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని సీబీఐని ఆదేశించింది. ఫిబ్రవరి 27న తెనాలిలో ప్రభుత్వ భద్రత నడుమ మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
ఆయేషా హత్య కేసులో నిందితులను గుర్తించడానికి తగిన ఆధారాలు లభించలేదని సీబీఐ ఇటీవల కోర్టుకు తుది నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా న్యాయస్థానం ఆమోదించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండో సారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం అవశేషాలను సీబీఐ కోర్టు ముందుంచారు. ఈ క్రమంలో తమ కుమార్తె అవశేషాలను అంత్యక్రియల నిమిత్తం తమకు అప్పగించాలని కోరుతూ ఆయేషా తల్లిదండ్రులు షంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు, ఫిబ్రవరి 27వ తేదీ తెనాలిలో అంత్యక్రియలు జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ, రెవెన్యూ, పోలీసు అధికారులు, మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అవశేషాల తరలింపునకు ప్రత్యేక వాహనం, ఎస్కార్ట్, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని హాస్టల్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.