- ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న పొన్నం
- 1,134 కారుణ్య నియామకాలను పూర్తి చేశామని వెల్లడి
- పీఆర్సీ పరిశీలనలో ఉందన్న మంత్రి
ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మెకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ బకాయిలైన పీఎఫ్ (రూ. 600 కోట్లు), సీసీఎస్ (రూ. 300 కోట్లు)లను భారీగా తగ్గించామని… 2,978 కొత్త బస్సులను ప్రవేశపెట్టామని తెలిపారు. 1,134 కారుణ్య నియామకాలు పూర్తి చేశామని, కొత్త ఉద్యోగాల భర్తీ తుది దశలో ఉందని వెల్లడించారు. ఇటీవల 2.1% డీఏ అమలు చేశామని, పీఆర్సీ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల 90కి పైగా డిపోలు లాభాల్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేస్తోందని వివరించారు.
విలీనం, యూనియన్ల గుర్తింపు మినహా మిగిలిన అన్ని అంశాలపై చర్చలకు తన తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ‘సంస్థ పరిరక్షణ-ఉద్యోగుల సంక్షేమం-ప్రయాణికుల సౌలభ్యం’ అనే లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు.
తమ డిమాండ్లు నెరవేరని పక్షంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నిన్న ప్రకటించింది. 21వ తేదీ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిపి వేస్తామని స్పష్టం చేసింది. 22వ తేదీ తెల్లవారుజాము నుంచి సమ్మెలోకి వెళ్తామని పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే మంత్రి స్పందించారు.