జిల్లాలో పకడ్బందిగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు..
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 104 మందిపై కేసు నమోదు..
రాత్రివేళలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం…నిర్జన ప్రాంతాలలో తనిఖీలు..
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 104 మందిపై సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధిగా సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని, సిటీ పోలీస్ యాక్ట్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని, బహిరంగ మద్యపానం, పబ్లిక్ న్యూసెన్స్, రాష్ డ్రైవింగ్, రాత్రి సమయాల్లో సమయానికి మించిషాపులు తెరవడం, పని లేకున్నా రోడ్లపై రావడం, బర్త్ డేల పేరుతో నడి రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించేవారిపై ప్రత్యేక దృష్టి సారించి సిటీ పోలీస్ యాక్టు అమలు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. అలాంటి వ్యక్తులకు జరిమానా, జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రధానంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన
చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.
కమిషనరేట్ పరిధిలో పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేస్తూ.. రాత్రివేళలో నిర్జన ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ….వీధుల్లో సంచరించడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం, వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం
ఘర్షణలకు దిగడం, ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.