జాతీయ వార్తలు

పారిస్ ఒలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో పతకం

  • రెజ్లింగ్‌లో కాంస్యం గెలిచిన అమన్ సెరావత్
  • ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్‌పై 13-5తో తిరుగులేని విజయం
  • పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం
  • తల్లిదండ్రులు, దేశ ప్రజలకు విజయాన్ని అంకితమిచ్చిన అమన్ సెరావత్
  • ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్‌లో కాంస్యం సాధించాడు. భారత్‌కు ఇది ఆరో పతకం. కాంస్య పతకం కోసం నిన్న 57 కిలోల విభాగంలో జరిగిన పోరులో 13-5తో ప్యూర్టోరికో రెజ్లర్ దరియన్ టోయ్‌ను ఓడించి పతకాన్ని తన మెడలో వేసుకున్నాడు. ఈ పోటీల్లో భారత్ తరపున పోటీపడిన ఏకైక పురుష రెజ్లర్ అమన్. 

గురువారం జరిగిన సెమీ ఫైనల్‌లో జపాన్ టాప్ సీడ్ రీ హిగుచి చేతిలో 0-10 తేడాతో చిత్తుగా ఓడిన అమన్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రత్యర్థిపై పూర్తి పైచేయి సాధించాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించి దరియన్‌ను చిత్తు చేసి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ పతకాన్ని అతడు తన దివంగత తల్లిదండ్రులు, దేశ ప్రజలకు అంకితం ఇచ్చాడు. 

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఏడో భారత రెజ్లర్‌గా అమన్ రికార్డులకెక్కాడు. 1952లో హెలింక్సిలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో కేడీ జాదవ్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. స్వతంత్ర భారతంలో తొలి పతకం అందుకున్న రెజ్లర్‌గా జాదవ్ పేరు రికార్డుల్లో నిలిచిపోయింది. ఇక, పతకం సాధించిన అమన్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం అందుకున్న అతి పిన్న వయస్కుడి (21 సంవత్సరాల 24 రోజులు)గానూ అమన్ రికార్డు సృష్టించాడు.

Related posts

25 ఉత్తరాలతో పెళ్లి పిలుపు.. నిర్మలతో ప్రేమకథను వివరించిన పరకాల ప్రభాకర్!

Ram Narayana

ఛత్తీస్ గఢ్ లో నేడు కూడా కాల్పుల మోత… మరో మావోయిస్టు అగ్రనేత మృతి!

Ram Narayana

గాంధీ కుటుంబంలో పెళ్లి సందడి: వైభవంగా ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా నిశ్చితార్థం

Ram Narayana