చక్రం తిప్పిన చంద్రబాబు …అశోక గజపతిరాజుకు గోవా గవర్నర్ పదవి
పదవి దక్కడంపై అశోక్ గజపతిరాజు స్పందన
విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టిన అశోక్ గజపతిరాజు
తాను ఎప్పుడూ అవకాశాల వెంట పరిగెత్తలేదని వెల్లడి
ప్రజలు ఏ బాధ్యతలు అప్పగించినా నిజాయతీగా నిర్వర్తించానని ఉద్ఘాటన
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్డీయే కూటమిలో కీలకంగా వ్యహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పడంతోనే అశోక గజపతి గవర్నర్ పదవి లభించిందనేది నిర్వివాదాంశం …పార్టీ లో సీనియర్ గా పరికి లాయల్ గా ఉన్న అశోకగజపతి గవర్నర్ పదవి ఇప్పించడం ద్వారా తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడిని చంద్రబాబు మరోసారి నిరూపించినట్లు అయింది ..
ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలిపారు.
అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, “నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ అవకాశాల వెంట పరిగెత్తలేదు. పార్టీ నాయకత్వం, ప్రజలు నాకు ఏ బాధ్యత అప్పగించినా దానిని శ్రద్ధగా, నిబద్ధతతో నిర్వహించాను. గోవా గవర్నర్గా నియమితులవడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ పదవిలో గోవా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.
తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నానని, అయినప్పటికీ ప్రజా సేవకే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. “విజయనగరం రాజవంశం నుంచి వచ్చిన నేను, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజల కోసం పనిచేయడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. గోవా గవర్నర్గా కూడా ఆ లక్ష్యంతోనే ముందుకు సాగుతాను” అని అన్నారు.
గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, ఆ సమయంలో తాను చేపట్టిన పనులు దేశ విమానయాన రంగంలో ముఖ్యమైన మార్పులను తెచ్చాయని ఆయన తెలిపారు. “నా అనుభవాన్ని, నైపుణ్యాన్ని గోవా రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగిస్తాను. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాను” అని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా, అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమని, ఆయన నాయకత్వంలో గోవా మరింత అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర నాయకులు ఆకాంక్షించారు.
అశోక్ గజపతిరాజుకు కంగ్రాట్స్ చెప్పిన సీఎం చంద్రబాబు

పూసపాటి రాజకుటుంబీకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా నియమితులవడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
“గోవా గవర్నర్ గా నియమితులైన పి.అశోక్ గజపతిరాజుకు హృదయపూర్వక శుభాభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇది గర్వకారణం. అశోక్ గజపతిరాజుకు ఇంతటి గౌరవనీయ పదవిని ఇచ్చిన సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర క్యాబినెట్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విశిష్ట పదవిలో అశోక్ గజపతిరాజు గారు విజయవంతం అవ్వాలని, పదవీకాలాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తారని ఆకాంక్షిస్తున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.