హరీశ్ రావు ఇంట విషాదం.. సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూత
వయోభారంతో హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస
హరీశ్ రావు కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి
దివంగత నేత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన
పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖుల సంతాపం
ఈరోజు సాయంత్రం ఫిల్మ్ నగర్లో అంత్యక్రియలు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీశ్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి సత్యనారాయణ రావు (95) మంగళవారం ఉదయం హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా సంతాప సందేశాన్ని విడుదల చేసింది. “మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీశ్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సత్యనారాయణ రావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన మరణవార్త తెలియగానే బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో పాటు పలువురు పార్టీ నేతలు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు . హరీశ్ రావు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు
సత్యనారాయణ రావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
హరీశ్ రావు తండ్రి పార్థివదేహానికి నివాళులర్పించిన కేసీఆర్, కేటీఆర్

- ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సత్యనారాయణ రావు
- తన బావ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించిన బీఆర్ఎస్ అధినేత
- సోదరి లక్ష్మిని, ఇతర కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. కోకాపేటలోని క్రిన్స్విల్లాస్లో ఉన్న సత్యనారాయణ రావు పార్థివ దేహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. అనంతరం హరీశ్ రావును, ఆయన తల్లి, తన ఏడో సోదరి అయిన లక్ష్మిని కేసీఆర్ పరామర్శించారు.
సత్యనారాయణ రావు, కేసీఆర్కు స్వయానా బావ అవుతారు. ఈ సందర్భంగా తన బావతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సత్యనారాయణ రావు మృతి వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ ఫోన్లో హరీశ్ రావుతో మాట్లాడి ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే.
అదే విధంగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సత్యనారాయణ రావు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా సత్యనారాయణ రావుకు నివాళులర్పించి, హరీశ్ రావు కుటుంబాన్ని పరామర్శించారు.

