ఆస్తి తగాదాలు మానవ సంబంధాలను ఎంతగా దిగజార్చుతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కేవలం 120 గజాల స్థలం కోసం సొంత అక్కనే ఓ తమ్ముడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. సాక్ష్యాలు దొరకకుండా మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి చెరువులో పడేసి, ఏమీ తెలియనట్టు నాటకమాడాడు. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్కు చెందిన పప్పురామ్ కుమావత్, అతడి అక్క లీలాదేవి (40) బాటసింగారంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే, ఆ ఇంటిని పప్పురామ్ తన పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇందులో తన వాటా ఇవ్వాలని లీలాదేవి ఒత్తిడి చేయడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన వద్ద పనిచేసే రాకేశ్, సునీల్ అనే మరో ఇద్దరి సహాయం తీసుకున్నాడు.
పథకం ప్రకారం గత నెల 28న ముగ్గురూ కలిసి లీలాదేవిని కర్రతో కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోని బాత్రూమ్లోనే ఉంచారు. మార్చి 2న ఓ కారులో మృతదేహాన్ని మజీద్పూర్ చెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రంపంతో శరీరాన్ని రెండు ముక్కలుగా కోసి, వేర్వేరు సంచుల్లో కట్టి చెరువులో పడేశారు.
అక్కడితో ఆగకుండా తన నేరం బయటపడకుండా ఉండేందుకు ఈ నెల 8న తన అక్క కనిపించడం లేదంటూ పప్పురామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఎవరితోనో వెళ్లిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో చెరువులో గాలించి శరీర భాగాలను వెలికితీశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.