పశ్చిమాసియాలోని పలు మార్గాల్లో విమాన సర్వీసులను పరిమితం చేసినప్పటికీ, నేడు (23న) మొత్తం 30 షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించాయి. ఈ మేరకు ఆ సంస్థలు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశాయి.
భారత్, సౌదీ అరేబియాలోని జెడ్డా మధ్య మొత్తం 10 విమానాలు యథావిధిగా నడుస్తాయి. ఢిల్లీ, ముంబైల నుంచి ఎయిర్ ఇండియా ఒక్కో రిటర్న్ సర్వీసును ఆపరేట్ చేస్తుండగా, బెంగళూరు, కోజికోడ్, మంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు నడుస్తాయి. వీటితో పాటు మస్కట్కు 4, రియాద్కు 4 షెడ్యూల్డ్ విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది.
షెడ్యూల్డ్ సర్వీసులతో పాటు, యూఏఈ, సౌదీ అరేబియాలకు 12 ప్రత్యేక విమానాలను కూడా నడుపుతున్నట్లు ఎయిర్ ఇండియా గ్రూప్ వెల్లడించింది. భారత, స్థానిక అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాతే ఈ విమానాలను ఆపరేట్ చేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రత్యేక సర్వీసుల ద్వారా దుబాయ్, అబుదాబి, షార్జాలకు ప్రయాణించవచ్చు.
అయితే, యూఏఈలోని రస్ అల్ ఖైమా, అల్ ఐన్, ఒమన్లోని సలాలా, సౌదీలోని దమామ్, బహ్రెయిన్, దోహా, కువైట్, టెల్ అవీవ్లకు ఎలాంటి షెడ్యూల్డ్ లేదా ప్రత్యేక విమానాలు ఉండవని స్పష్టం చేసింది. ఉత్తర అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయని తెలిపింది.
తాత్కాలికంగా సేవలు నిలిచిపోయిన మార్గాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా తమ ప్రయాణాన్ని రీ-బుక్ చేసుకోవచ్చని లేదా పూర్తి రీఫండ్ పొందవచ్చని ఎయిర్ ఇండియా సూచించింది. సహాయం కోసం తమ వెబ్సైట్ లేదా కస్టమర్ సపోర్ట్ సెంటర్లను సంప్రదించాలని కోరింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులు వాట్సాప్ ద్వారా కూడా రీ-బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించింది.