అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం హర్మూజ్ జలసంధిపై పట్టు బిగించేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఈ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్లపై బ్యారెల్కు ఒక డాలర్ చొప్పున టోల్ విధించాలని, ఆ చెల్లింపులను క్రిప్టోకరెన్సీ రూపంలో స్వీకరించాలని యోచిస్తున్నట్టు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఒక కథనంలో పేర్కొంది.
ఇరాన్ ఆయిల్, గ్యాస్ ఎగుమతిదారుల సంఘం ప్రతినిధి హమీద్ హొస్సేనీ కథనం ప్రకారం.. జలసంధి గుండా వెళ్లే నౌకలను పర్యవేక్షించి, ఆయుధాల రవాణాను అడ్డుకోవడమే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. నౌకలు తమ సరుకు వివరాలను ఈ-మెయిల్ ద్వారా పంపాలని, అనంతరం అధికారులు టోల్ లెక్కించి చెల్లింపుల కోసం తక్కువ సమయం ఇస్తారని వివరించారు. ఈ ప్రక్రియకు సమయం పట్టవచ్చని, తాము తొందరపడటం లేదని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, అనుమతి లేకుండా జలసంధిలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ధ్వంసం చేస్తామని రేడియో ద్వారా తీవ్ర హెచ్చరికలు జారీ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ తాజా నిర్ణయాలతో గల్ఫ్ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. దాదాపు 400 నౌకలు నిలిచిపోవడంతో పరిస్థితి ‘కార్ పార్కింగ్’ను తలపిస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీంతో లక్షల బ్యారెళ్ల చమురు రవాణా స్తంభించిపోయింది.
అయితే, ఇరాన్ టోల్ ప్రతిపాదనను ఒమన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుత అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం టోల్ వసూలుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా, సురక్షితంగా తెరిస్తేనే కాల్పుల విరమణ పొడిగింపు సాధ్యమని అమెరికా తేల్చిచెప్పింది.