హైదరాబాద్కు అఖిలేశ్ యాదవ్, సీఎం కేసీఆర్తో భేటీ…!
- ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అఖిలేశ్
- విమానాశ్రయంలో స్వాగతం పలికిన మంత్రులు
- అక్కడి నుండి నేరుగా ప్రగతి భవన్ కు అఖిలేశ్
సమజ్వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న అఖిలేశ్… బేగంపేట విమానాశ్రయం నుండి నేరుగా ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేశ్కు కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న అఖిలేశ్ కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు.
విపక్ష నేతలను కలిసిన అఖిలేశ్ ఈరోజు కేసీఆర్ను కలిశారు: కిషన్ రెడ్డి
- అఖిలేశ్, కేసీఆర్ భేటీతో ఎవరికి ఎవరు బీ టీమో తెలుస్తుందని వ్యాఖ్య
- కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శ
- ఈ రెండు పార్టీలు గతంలో పొత్తు పెట్టుకున్నాయన్న కేంద్రమంత్రి
![Kishan Reddy on Akhilesh and KCR meeting](https://i0.wp.com/img.ap7am.com/bimg/cr-20230703tn64a2a7ba05f81.jpg?resize=600%2C400&ssl=1)
ఈరోజు సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారని, ఇటీవల పాట్నాలోను విపక్ష నేతలతో అఖిలేశ్ భేటీ అయ్యారని, వీరిద్దరి సమావేశాన్ని చూస్తే ఎవరికి ఎవరు బీ టీమో తెలుస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని, ఆ రెండు పార్టీల డీఎన్ఏ కూడా ఒక్కటేనని విమర్శించారు. ఈ రెండు పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. కానీ తమ పార్టీ మాత్రం ఎప్పుడూ కూడా బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదని గుర్తు చేశారు.
మరోపక్క, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి పారిపోయిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు. అలాంటి రాహుల్ కు బీజేపీని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. తమ పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్.. రెండు సమదూరంలోనే ఉన్నాయన్నారు. తాము బీఆర్ఎస్ తో గతంలో కలవలేదని, భవిష్యత్తులోను కలిసే పరిస్థితి లేదన్నారు. కుటుంబ పాలన, అవినితిపై బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు.